మగధీర-అసలు కథ!!!
చారి మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి. వృత్తిరీత్యా ఆయన ఉత్తరభారతదేశంలో అనేక చోట్ల పనిచేశారు. ఆయనలో మంచి చరిత్రకారుడు కూడా ఉన్నాడు. చారిత్రక విషయాలను సేకరించి వాటిని తన సృజనాత్మకతతో మేళవించి రాసిన నవల 'చండేరి". "మగధీర" మూలకథ తనదేనని చారి క్లెయిమ్ చేస్తున్నారు. ఆయన నవలను ప్రచురించిన ప్రఖ్యాత పబ్లిషింగ్ సంస్ధ ఎమెస్కో యజమాని విజయకుమార్ కూడా ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో 85 శాతం ఇదే కథను కాపీ కొట్టి సినిమా తీశారని చెప్పారు. ఒక రచయిత ఇంటలెక్చువల్ ప్రాపర్టీని తస్కరించడం తగదని ఆయన అన్నారు.
ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న మగధీర ఎస్పీ చారి ద్వారా పెను వివాదంలో చిక్కుకుంది. నాలుగు వందల ఏళ్ళ నాటి ప్రేమ కథ అది. ఆనాటి ప్రేమికుల ప్రేమ కథ విఫలమై ఇద్దరూ బావిలో దూకి చనిపోతారు. వారికి అంతకు ముందే రాజ గురువు మళ్ళీ మీరు నాలుగు వందల ఏళ్ళ తర్వాత మరు జన్మలో కలిసి ప్రేమను సార్ధకం చేసుకుంటారని చెబుతాడు. చారి నవలలో ఇతివృత్తమదే. మగధీర సినిమా ప్రధానాంశమదే. కాపీ కొట్టారా? యాధృచ్చికంగా ఆలోచనలు వచ్చాయా అన్నది చర్చనీయాంశం. నాలుగువందల ఏళ్ళ "చండేరి" ప్రేమ గాధ జానపదుల నోళ్ళలో నానుతోందని దానికి ఎవరికీ కాపీ రైట్ ఉండదని మగధీర ముఖ్యులు చెప్పుకోవచ్చు. కానీ న్యాయస్ధానం ఏ విధమైన తీర్పు ఇస్తుందో చూడాలి.