జగన్ ఏం చేస్తారు?
హైదరాబాదుకు వచ్చిన తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటారని తెలుస్తోంది. తనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయకపోతే జగన్ ఏం చేస్తారు, ఆయనకు మద్దతిస్తున్న లాబీ ఏం చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వస్తూనే ఉంది. జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆయన లాబీకి చెందిన నాయకులు కొంత మంది సీనియర్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారంపై గత రెండు, మూడు రోజులుగా మాట్లాడుతున్న సీనియర్ నేత రోశయ్యపై పార్టీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీ అధిష్ఠాన వర్గం ఆదేశాలు కేశవరావుకు కూడా వర్తిస్తాయని ఆయన అన్నారు. పుండుపై కారం చల్లే విధంగా కేశవరావు మాట్లాడుతున్నారని ఆయన మంగళవారం విరుచుకుపడ్డారు. పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీసేలా కెకె మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్న నాయకులు ఆగ్రహంగానే ఉన్నారు. లోలోపల మసలిపోతున్నట్లు కూడా కనిపిస్తోంది.
అయితే, జగన్ మూడు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ముగిసే వరకు ఆగకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి దిగవచ్చునని అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి కలత చెందిన ప్రజలను, హఠాన్మరణం చెందిన కుటుంబాలను కలుసుకునే ఉద్దేశంతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజామద్దతును కూడగట్టి అధిష్ఠాన వర్గానికి తన ప్రజాబలమేమిటో నిరూపించే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. అదే సమయంలో మరింతగా పార్టీ నేతల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం కూడా ఆయన చేయవచ్చునని అంటున్నారు. జగన్ భవిష్యత్తు కార్యక్రమంపై పార్టీ అధిష్ఠాన వర్గం ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. ఏమైనా ఇది జగన్ కే కాకుండా కాంగ్రెసు పార్టీకి కూడా పరీక్షా కాలమే.