మౌనమేలనోయి?
తాజాగా బుధవారం జరిగిన కరీంనగర్ జడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆరుగురు టిఆర్ఎస్ జడ్పీటీసీలు ప్లేటు ఫిరాయించి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వటం నాయకత్వానికి మిం గుడు పడకుండా తయారైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి విషాద మరణం తర్వాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్నా, ఆ తర్వాత సైతం అదే స్థితి కొన సాగటం సీనియర్ నేతలు సహా ఎవరికీ మింగుడు పడటం లేదు. అసలు కెసిఆర్ మనసులో ఏముందో వారు అర్థం చేసుకోలేకపోతున్నారు.
క్రమశిక్షణ కమిటీని, పొలిట్ బ్యూరోను నియ మించి, నియోజకవర్గాలకు ఇన్చార్జీలను ఏర్పాటు చేసినా కార్యక్రమాల విషయంలో కదలిక లేకపో వటం సాధారణమైపోయిందన్న వాదనలు సీనియర్ల నుంచే వస్తున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డిపై ఏర్పాటు చేసిన ప్రజాకోర్టు గందరగోళంలో పడిపోయి అభాసుపాలు కావటం, కెసిఆర్ అంతకు ముందు రోజే ఢిల్లీ వెళ్ళిపోవటం వంటివి కార్యకర్తలను ఇబ్బందుల్లో పడవేశాయి. ఎవరు ఎలాంటి విమర్శ చేసినా జవాబు చెప్పు కోలేని స్థితిలో ఉన్నామని నాయకులు బహిరంగం గానే చెప్పుకుంటున్నారు.
కరీంనగర్ అనగానే తెలంగాణ రాష్ట్ర సమితికి గట్టి పట్టు ఉన్న జిల్లా అని అందరూ అంగీకరిస్తారు. కెసిఆర్ వరుసగా మూడు పర్యాయాలు మంచి మెజారిటీతో విజయం సాధించిన లోక్సభ స్థానం అది. ఇటీవలి ఎన్నికల్లో ఎంత ఎదురు గాలి వీచినా ఆ జిల్లా నుంచి అత్యధికంగా నలుగురు ఎమ్మె ల్యేలు గెలిచారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచిన 10 స్థానాల్లో అత్యధికంగా గెలిచిన జిల్లా ఇదే. అలాంటి జిల్లాలో జడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతిలో ఉన్న ఆరుగురు జడ్పీటీసీలు అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించటం చూస్తే పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కెసిఆర్ కుమారుడు కెటిరామారావు ఈ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం నుంచి, శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుంచీ ప్రాతినిధ్యం వహిస్తున్నా, జడ్పీటీసీలను కనీసం తట స్థంగా అయినా ఉంచలేకపోయారన్న విమర్శలు మొదలయ్యాయి.
పార్టీలో ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియ టం లేదని, కార్యక్రమాలను నిర్ణయించటం, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటం మాట అటుంచి కనీస సమాచారం అయినా అందటం లేదని కొందరు సీనియర్లు ఆవేదనగా చెప్పారు.