రోశయ్య ఎందుకు మారడం లేదంటే...
అమీర్ పేటలో ఉన్న తన స్వగృహం నుంచే రోశయ్య ముఖ్యమంత్రిగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అది ఇరుకు అయినప్పటికీ రోశయ్య వద్దకు నిత్యం వచ్చే విజిటర్లు తక్కువ కాబట్టి ఇబ్బంది లేదు. మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌస్ ను అధికారిక నివాసంగా మార్చుకున్నారు. ఆయన బాత్ రూమ్ లో జారిపడి తీవ్రంగా గాయపడిన సంఘటన అక్కడ జరిగింది. ఆ తర్వాత ఇందిరా గాంధీ ఆయన పదవిని పీకేసి అంజయ్యకు అప్పగించింది.
చెన్నారెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన స్వగృహం తార్నాకలో సిద్ధమై ఉంది. రెండో సారి కూడా ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉండలేకపోయారు. విజయభాస్కరరెడ్డి కూడా ముఖ్యమంత్రిగా సొంత ఇళ్ళల్లోనే గడిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు కూడా అంతే. దీనితో ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రీకి ఒక అధికార నివాసం లేకుండా పోయింది. ఆ లోటును రాజశేఖరరెడ్డి గ్రీన్ ల్యాండ్స్ లో అధికార నివాసాన్ని దాదాపు పది కోట్ల రూపాయలతో (ఆ భూమి విలువ 100 కోట్ల పైన ఉంటుంది) నిర్మించి తీర్చారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా అందులో నివసించవచ్చు. కానీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అంత విషాదకరంగా మరణించడంతో రోశయ్యే కాదు, ఆయన తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు కూడా ఆ ధికార నివాసాన్ని ప్రిఫర్ చేయకపోవచ్చు.
సిఎం క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతం జగన్ మనుషులు, ఆయన విధేయులు క్యాంప్ చేసి ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ కుటుంబానికి ఏ మాత్రం సన్నిహితులైనా వచ్చి ఇక్కడ కొంత కాలం కొన్ని రూముల్లో బస చేసి వెళ్ళవచ్చు.