వైఎస్ కు ఎందుకింత కసి?
శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే దాడి చేయాలన్నది వైఎస్ వ్యూహం కావచ్చు. తెలంగాణ విషయంలో వైఎస్ గత ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే. టీఅర్ఎస్ ను కలుపుకోకపోవడం వల్ల నష్టం జరుగుతుందని తెలిసినా ఆయన రిస్క్ చేశారు. 2004 ఎన్నికల్లో వైఎ స్ ప్రమేయం లేకుండానే కాంగ్రెస్-టీఅర్ ఎస్ ఒప్పందం కుదిరిపోయింది. అప్పుడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్, గులాం నబీ ఆజాద్ లు వైఎస్ ప్రమేయం లేకుండానే టిఆర్ ఎస్ కు అన్ని స్ధానాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. "కాంగ్రెస్ పార్టీ టీఅర్ ఎస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చింది" అని. మరి గత ఎన్నికల్లో అదే తప్పును తెలుగుదేశం పార్టీ చేసింది.
టీఆర్ ఎస్ కు త గినంత బలం లేదని చంద్రశేఖరరావు భావిస్తున్నారా? సొంతంగా అన్ని స్ధానాల్లో పోటీ చేసే సాహసం ఈయన ఎందుకు చేయలేకపోతున్నారు? తెలంగాణ సెంటి మెంట్ అనేది చిలుకుతున్న వెన్న వంటిది. ఓపికగా చిలికితే వెన్న పడుతుంది. కానీ చంద్రశేఖరరావు అన్నం ఉడకక ముందే పళ్ళెం చేతబెట్టుకుని కూర్చునే వ్యక్తి.
తన మీద తెలంగాణ రెడ్డి నాయకులు తిరగబడుతున్నారని తెలుసుకున్న వైఎస్ ఇంకా ముఖ్యమైన విషయాలున్నా ఈ విషయం మీదనే దృష్టి సారించారు. తెలంగాణలో అనేక మంది కాంగ్రెస్ అభ్యర్ధులను వైఎస్ పనిగట్టుకుని ఓడించినట్టు ఆరోపణ ఉంది. మాజీ హోం మంత్రి జానారెడ్డిని కూడా ఓడించాలన్న ప్రయత్నం జరిగిందని సమాచారం. హోంశాఖను ఒక మహిళతోనైనా నడిపించగలనని ఆయన ఒక సంకేతం పంపారు. దీనిని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడానికి మంత్రి శ్రీధర్ బాబు సహా వైఎస్ మనుషులు మనుషులు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కూడా ఇప్పుడు వైఎస్ సొంత మనిషి అయిపోయారు. మొత్తమ్మీద వైఎస్ తాత్కాలికంగా అయినా తెలంగాణ వాదాన్ని దెబ్బతీయగలిగారు. వైఎస్ కాకుండా మరో ముఖ్యమంత్రి ఉంటే ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం దాదాపు వచ్చి ఉండేదన్న అభిప్రాయం ఉంది.
వైఎస్ టీఅర్ ఎస్ పై చేసిన ప్రసంగం తెలంగాణ సెంటిమెంట్ ను పెంచేదిగా ఉంది. చంద్రశేఖరరావు వల్ల బలహీన పడిన తెలంగాణ సెంటిమెంట్ ను వైఎస్ బలోపేతం చేశారు. వైఎస్ తాత్కాలికంగా తన ప్రయోజనాలను చూసుకుంటున్నట్టు కన్పిస్తోంది. వైఎస్ కు పూర్తిగా స్వేచ్చ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ విషయంలో కూడా ఆయన చెప్పినట్టు వ్యవహరించే అవకాశముంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏదో చేయడానికి ప్రయత్నించినా ఢిల్లీ సహకరించకపోవచ్చు.