అన్ని దిక్కులా జగన్ కు ఎదురు గాలి
జగన్ "సాక్షి"లో ఏఏ కంపెనీలు ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టి, ప్రభుత్వం నుంచి ఎన్ని లాభాలు పొందాయో ఈనాడు మొన్న సమగ్ర కథనం ప్రచురించడం సంచలనం కలిగించింది. దానికి ప్రతిగా "సాక్షి" చంద్రబాబు, రామోజీ ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారంటూ కౌంటర్ కథనం ప్రచురించింది. మొత్తానికి ఈనాడు కథనమే హైలైట్ కావడంతో సాక్షి డిఫెన్స్ లో పడవలసి వచ్చింది. రెండు పెద్ద మీడియా గ్రూపులు రెండు కులాలుగా, రెండు పార్టీలుగా విడిపోయి ప్రజల మీదికి కథనాలను రుద్దడంపై సామాన్యుల్లో ఏవగింపు కన్పిస్తోంది.
ఇక జగన్ విషయానికే వస్తే, తండ్రి శవాన్ని ఇంకా ఖననం చేయకముందే ఆయన ముఖ్యమంత్రి కావాలంటూ వందకు పైగా కాంగ్రెస్ ఎమ్మెలేల నుంచి సంతకాల సేకరణ జరిగింది. అయినా ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కోరిక నెరవేరలేదు. ఈ విషయంలో అధిష్టానవర్గం ఆచితూచి వ్యవహరించింది. జగన్ వ్యాపారల మీద, వ్యవహారశైలి మీద, ఆయన సంస్ధల్లో పెట్టుబడులు పెట్టినవారిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఫేవర్ల మీద ఇంటిలిజెన్స్ బ్యూరో నుంచి సమగ్ర నివేదికలు తెప్పించుకుని పరిస్ధితిని అంచనా వేశారు. జగన్ ను ఇప్పుడు కాకుండా 2013 లో ముఖ్యమంత్రిని చేయాలని (అది కూడా కాంగ్రెస్ బలహీన పడిన పక్షంలోనే) హైకమాండ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
జగన్ వ్యాపారాల్లో పెద్ద లాభాలు వస్తున్నాయా అంటే అదీ లేదు. సాక్షి మీడియా గ్రూపు తీవ్ర నష్టాల్లో ఉంది. జగతి సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించి వంద రూపాయలకే బ్యాగ్ సిమెంట్ ను అందిస్తోంది. ప్రస్తుతానికి ఆ వ్యాపారం బాగున్నా ముందు ముందు ఇతర కంపెనీలు కూడా ధర తగ్గించి గట్టి పోటీని కొనసాగించే అవకాశాలున్నాయి. ఓబుళాపురం గనుల్లో "గాలి" కనెక్షన్ మొదట కలిసి వచ్చినా ఇప్పుడు రాజకీయంగా రివర్స్ అయింది. ఈ నేపధ్యంలో "గాలి" నిధులు వచ్చే అవకాశం లేదు. ఎన్నో ఆశలతో వ్యాపారాల్లోకి, రాజకీయాల్లోకి వచ్చిన ఈ బిడ్డడిని ఆదేవుడు కాపాడాలని ఆకాంక్షిద్దాం.