సహాయ మంత్రి పదవికి జగన్ అయిష్టత?
కేంద్రంలో పదవి కంటే జగన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పైనే కన్ను ఉంది. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి పరోక్షంగా ఊపిరులూది, రోశయ్య అసమర్ధుడైన సిఎం అని నిరూపించి, ఆయనను తప్పించడానికి జగన్ శిబిరం ప్రయత్నిస్తోందన్న విమర్శలు, ఆరోపపణలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులకు జగన్ శిబిరం నుంచి నిధులు వెళ్తున్నట్టు ఒక ప్రచారం సాగుతోంది. మరో వైపు తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడానికి తండ్రి తరహాలోనే జగన్ ప్రయత్నిస్తున్నారని టీఅర్ ఎస్ నాయకులు బాహాటంగా విమర్శించారు.
తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మౌనం వహించాలని జగన్ వర్గం నిర్ణయించుకున్నట్టు సమాచారం. కేంద్రంలో సహాయ మంత్రి పదవిని తీసుకునే విషయంలో మాత్రం జగన్ ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. సహాయ మంత్రిగా తాను కూడా పనబాక లక్ష్మి వంటి వారి జాబితాలో చేరిపోవడం జగన్ కు ఇష్టం లేదని చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి కేంద్రీకరించి రోశయ్యకు పక్కలో బల్లెంలా మారాలన్నది జగన్ వర్గం వ్యూహంలా కన్పిస్తోంది. తన తల్లికి మంత్రి పదవి ఇవ్వడానికి రోశయ్య సిద్ధపడుతున్నా, ఆ తాయిలాన్ని నిరాకరించాలని వైఎస్ కుటుంబం నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఎన్నో విషయాలు వచ్చే వారం స్పష్టమవుతాయి.