జగన్నాటకం!
బెంగళూరులో కెవిపితో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ నెలాఖరులోగా అధిష్టానవర్గం నుంచి సానుకూల స్పందన రావచ్చని, అప్పటి వరకు తొందరపడి మాట్లాడవద్దని కెవిపి జగన్ కు సూచించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను బెంగళూరు రానివ్వవద్దని, అవసరమైతే ఫోన్ లో మాట్లాడమని కెవిపి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అధిష్టానవర్గం నుంచి పిలుపు వస్తే కెవిపి, జగన్ బెంగళూరు నుంచే ఢిల్లీ వెళ్తారు.
వైఎస్ అసమ్మతి రాజకీయాలు నడిపినప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులకు విధేయుడిగా వారి మంత్రివర్గాల్లో పని చేసిన రోశయ్యకు అసమ్మతీ రాజకీయాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. హై కమాండ్ మీద ఎన్ని రకాల వత్తిళ్ళు తెస్తారో తెలుసు. అందువల్ల ఆయన ప్రో యాక్టివ్ గా ఉండి హై కమాండ్ అడగకపోయినా జగన్ గ్రూపు కార్యక్రమాలను పూసగుచ్చినట్టు వివరిస్తున్నట్టు తెలిసింది.
ముఖ్యమంత్రి కావడం జగన్ కు ఇప్పుడు రెండు రకాలుగా అత్యవసరం. తన తండ్రి పెంచిన సామ్రాజ్యాన్ని తన చేతిలోకి తెచ్చుకుని ఆయన ఆత్మశాంతి కోసం ప్రయత్నించడం. రెండోది, తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోడానికి ముఖ్యమంత్రి పదవి ఎంతైనా అవసరమని భావించడం. ఆయన గ్రూపులో ఎన్నో నష్టజాతక కంపెనీలున్నాయి. ముఖ్యమంత్రి పదవి ఉంటే తప్ప వాటిని లాభాల బాట పట్టించడం మరో రకంగా కష్టం.