ఎదురులేని వైఎస్
"70 ఏళ్ళు దాటిన వారికి కాంగ్రెస్ టికెట్లు ఉండవు" అని రాజశేఖరరెడ్డి ఇటీవల ప్రకటించినప్పటి నుంచి ఈ వృద్ధ సింహాలు రాజశేఖరరెడ్డి అంటే భయపడి చస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఎంఎస్, పురుషోత్తమరావు, వెంకటస్వామి వంటి వారు వైఎస్ ప్రకటనతో భయపడినా కాళ్ళ బేరానికి రాలేదు. కాళ్ళ బేరానికి వచ్చినవాడు ఒక్క రోశయ్యే. ఈసారి చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుస్తానన్న ఆశ ఆయనకు ఏ కోశాన లేదు. అందువల్ల వైఎస్ తోక పట్టుకుంటే ఈసారి రాజ్యసభకు వెళ్ళవచ్చన్న ఆశ ఈ రాజకీయ శ్రేష్టుడికి పట్టుకున్నట్టుంది.
తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల వత్తిడిని తట్టుకుని కాంగ్రెస్ హై కమాండ్ వద్ద తనదే పై చేయి అని చాటుకున్న వైఎస్ 294 స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను, అన్నిటిలోనూ తన సొంత మనుషులను నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధించకపోయినా కనీసం వంద మంది తన సొంత ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కూర్చోవాలన్న పట్టుదల వైఎస్ లో కనిపిస్తోంది. వైఎస్ అంటే ఇప్పుడు అధిష్టాన వర్గానికి కూడా పెద్ద దడ ఉంది. ఈ కీలక సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పోవడం పార్టీ శ్రేయస్సుకు మంచిది కాదన్న అభిప్రాయంతో అధిష్టాన వర్గం ఉంది.