చంద్రబాబు బిజినెస్ కోటరీ
రెండు సార్లు వరుసగా ఓటమి పాలైన పార్టీని తిరిగి బలోపేతం చేసి, అధికారానికి చేరువ చేయడం ఎలాగన్న విషయంపై పార్టీలో మథనం జరుగుతున్నప్పటికీ మారనే చంద్రబాబు వైఖరి వల్ల ఏమీ చేయలేమనే నిరాశానిస్పృహలు నాయకుల్లో, కార్యకర్తల్లో అలుముకుంటున్నాయి. పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరును పార్టీ కార్యకర్త నుంచి పొలిట్బ్యూరో సభ్యుల వరకు దాదాపు అందరూ అసంతృప్తితోనే ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ బలపడాల్సింది పోయి మరింత బలహీన పడటం పట్ల నేతలకు ఏం చేయాలో ఇప్పుడు పార్టీ నేతలకు అంతుబట్టడంలేదు. ఈ రోజు చెప్పిన మాటను చంద్రబాబు మర్నాటికి మార్చుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు లాక్కున్న తర్వాతి రోజు నుంచి ఇప్పటివరకు 15 ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో పార్టీ విజయాలకన్నా అపజయాలే ఎక్కువగా చవిచూసింది. చంద్రబాబును జాతీయ నాయుకుడిగా, కేంద్రంలో చక్రం తిప్పే నేతగా ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా 1999లో మినహా ఆయన నాయత్వంలోని పార్టీ ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేదు. ఇందుకు ప్రధాన కారణం చంద్రబాబు విశ్వసనీయత ప్రమాదంలో పడడమే కారణమని అంటున్నారు.
చంద్రబాబు అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ నుంచి ముఖ్యమైన నాయకులెందరో వెళ్లిపోయారు. కొత్తగా ఎవరూ చేరడం లేదు. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిన కొంత మంది తిరిగి పార్టీలోకి వచ్చినా వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదు. పార్టీలో ఏం చేయాలో ఏ నాయకుడికీ అంతు పట్టని పరిస్థితి ఉంది. ఏం మాట్లాడితే చంద్రబాబు ఏమంటారో, ఏం చేస్తే చంద్రబాబు ఎలా ప్రతిస్పందిస్తారో తెలియని అయోమయ పరిస్థితి పార్టీ నాయకుల్లో నెలకొని ఉంది. తన ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాలకు తిలోదకాలిచ్చి కార్పొరేట్ లక్షణం కోసం తాపత్రయపడిన విధానాలు చంద్రబాబును ఇప్పటికీ వెన్నాడుతున్నాయి. చంద్రబాబు ఎన్నికల సమయంలో గానీ ఇతర సమయాల్లో గానీ చెప్పే మాటలను ప్రజలు ఏ మాత్రం విశ్వసించడం లేదని పార్టీ నాయకులే అంటున్నారు. విశ్వసనీయత కోసం ఏ మాత్రం ప్రయత్నించకుండా, జిమ్మిక్కుల ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని అంటున్నారు.