తెలంగాణ 'చిదంబర' రహస్యం
తెలంగాణకు వ్యతిరేకం కాదని, చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ఎఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ ఇటీవల పదే పదే చెబుతున్నారు. అయితే, కాంగ్రెసు పార్టీ వైఖరి అందుకు భిన్నంగా ఉందని ఇటీవలి ప్లీనరీ సమావేశంలో విడుదల చేసిన పుస్తకంలోని అంశాలు తెలియజేస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెసు, భారత జాతి నిర్మాణం పేర ప్లీనరీలో ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన పోరాటం విజయం సాధించడంతో స్వయం ప్రతిపత్తి కోరే విషయంలో ఇతర రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇచ్చినట్లయిందని, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల సరిహద్దుల ఏర్పాటుకు మార్గం సుగమమైందని ఆ పుస్తకంలో కాంగ్రెసు పార్టీ అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యను బట్టి తెలంగాణకు కాంగ్రెసు పార్టీ ఏ విధంగానూ అనుకూలంగా లేదనే అభిప్రాయం బలపడుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ను పట్టించుకుంటున్నామని చెబుతూనే అందుకు వ్యతిరేకంగా వ్యవహరించడం కాంగ్రెసు వ్యూహంలో భాగమని చెబుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షులను కాకుండా, పార్టీ విధానాన్ని తెలియజేయాలని కాకుండా చిదంబరం ఆరవ తేదీ సమావేశానికి పార్టీకి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించారని అంటున్నారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఎండగట్టడమే ప్రధాన వ్యూహమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కాదని అంటున్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎండగడుతూ తెలంగాణలోనూ సీమాంధ్రలోనూ తెలుగుదేశం పార్టీని బలహీనపరచడమే కాంగ్రెసు లక్ష్యంగా కనిపిస్తోంది.