ఎన్టీఆర్ మైండ్ సెట్ మారిందా?
ఆరు ఫైట్లు, ఆరు పాటల ద్వారా సినిమాను తన ఇమేజ్ తో బాక్సాఫీసు వద్ద బద్దలు కొట్టించగలమనే నమ్మకం చాలా మంది మాస్ హీరోలకు ఉందే. ఆ మాస్ ఇమేజ్ కు ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే భయంతో కథాబలం ఉన్న సినిమాలను, మాస్ మసాలా లేని సినిమాలను, ఫైట్లూ డ్యూయెట్లూ లేని సినిమాలను హీరోలు ఒప్పుకోవడం లేదు. అందరి కన్నా ముందుగా ఫెయిల్యూర్ కు అసలు కారణం కనిపెట్టిన హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నే చెప్పుకోవాలి. పోకిరి తర్వాత అంతగా హిట్టివ్వని మహేష్ బాబు కూడా ఈ ఈ విషయంలో వెనకపడే ఉన్నారని చెప్పాలి. ఖలేజా అంతగా సక్సెసు కాకపోవడానికి, బృందావనం సినిమా విజయం సాధించడానికి అదే కారణమని టాలీవుడ్ లో అనుకుంటున్నారు.
నా అల్లుడు, నరసింహుడు, అశోకా సినిమాల ఫ్లాప్ లతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రమైన ఆలోచనలో పడ్డారనే చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చిన ఆయన సినిమాల్లో, ఆ సినిమాల్లో పోషించే పాత్రల్లో తేడా కనిపిస్తూ వచ్చింది. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది యమదొంగ సినిమాను. ఈ సినిమా కావాల్సినంత విజయం సాధించిందనే చెప్పాలి. తాత సీనియర్ ఎన్టీఆర్ ను అనుకరిస్తూ చేసిన నటన అందరి మెప్పూ పొందింది. రాఖీ, అదుర్స్ సినిమాల విషయంలో కూడా తేడాను చూస్తాం. రాఖీ కథాబలం ఉన్న సినిమా అయితే, అదుర్స్ లో విభిన్నమైన పాత్రను ఎన్టీఆర్ వేశారు. పిలక జుట్టుతో నవ్వులను పండించే పాత్రను ఎన్టీఆర్ పోషించారు. గంభీరమైన డైలాగుల ద్వారా మాస్ ఇమేజ్ ను కాపాడుకోవాలనే తత్వం ఎన్టీఆర్ లో కనిపించకపోవడమే అదుర్స్ లో ఆయన ఆ పాత్రను పోషించడానికి అంగీకరించారని చెప్పవచ్చు. మొత్తం మీద, జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరోలను పట్టి పీడిస్తున్న వ్యాధికి మందు కనిపెట్టినట్లే ఉన్నారు.