శ్రీకృష్ణకు ముందే కాంగ్రెస్ నేతల రాజీనామా?
నివేదిక తెలంగాణకు అనుకూలంగా రాకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలతో సహా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకూడా తీవ్ర ఉద్యమాలు చేస్తాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి వారికంటే ముందుగానే రాజీనామాస్త్రంతో ఉద్యమంలోకి దిగి ఇటు తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని ప్రజలకు చెప్పడమే కాకుండా అటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసినట్లవుతుందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి పాలనతోనైనా తెలంగాణ తెచ్చుకోవాలనే భావనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ నూ కాపాడుకోవచ్చు. అందుకే ఆదివారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులో జరిగిన తెలంగాణ ప్రజా ప్రతినిధుల సమావేశంలో అందరూ రాజీనామాస్త్రాలు బయటకు తీశారు. నివేదిక తెలంగాణకు అనుకూలంగా రాకపోతే అది అందరికన్నా ఎక్కువగా తెరాసకు లాభిస్తుంది. కాబట్టి నివేదికకు ముందే రాజీనామాలు సమర్పించి కేంద్రాన్ని ఒత్తిడికి గురిచేయడం ద్వారా కేంద్రాన్ని తెలంగాణకు అనుకూలంగా మార్చుకోవచ్చని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించిన తెలంగాణ, సీమాంధ్రుల రాజీనామా ఒత్తిడుల వల్లనే ఆగిపోయిందనే వాదనను కొందరు ముందుకు తెచ్చినట్టుగా సమాచారం.ఇలా చేయడం ద్వారా తెరాస ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కమిటీ నివేదికకు ముందుగానే రాజీనామా చేయటం శ్రేయస్కరంగా వారు భావిస్తున్నారు. నిత్యం కాంగ్రెస్ వాళ్లు పదవుల కోసం రాజీనామాలకు సిద్ధపడటం లేదన్న కేసిఆర్ వ్యాఖ్యలకు వారికన్నా ముందే రాజీనామాలు చేసి సమాధానం చెప్పినట్టవుతుందని,తద్వారా తమకు, తమతో పాటు కాంగ్రెస్ కు తెలంగాణలో ఢోకా ఉండదని వారు భావిస్తున్నారు.తెలంగాణ ఎప్పుడు వచ్చినప్పటికీ అనుకూలంగా ఉంటే చాలనే భావనతో వారు ఉన్నట్టుగా తెలుస్తోంది.
అలాకాకున్నా ముందుగా రాజీనామా చేయకున్నా అందరూ రాజీనామాలు సిద్ధంగా ఉంచుకొని నివేదిక వ్యతిరేకంగా వచ్చిన మరు నిమిషమే రాజీనామా చేయాలనే యోచనలో మాత్రం ఉన్నారు.అయితే వారు డిసెంబర్ 31 తర్వాతే రాజీనామా చేస్తామని స్పష్టం చెబుతున్నారు. అందులో భాగంగా సోమవారంనుండి దీక్షలు చేయడానికి సిద్ధమయ్యారు.