దినపత్రికల అక్రమార్జనపై నివేదిక
వార్తకు, వాణిజ్య ప్రకటనకు ఎంతో తేడా ఉంది. పాఠకులు ప్రకటనను ప్రకటనగానే చూస్తారు. దాని మీద పెద్ద నమ్మకం పెట్టుకోరు. కానీ వార్త కళంకిత రహితమైనది, అత్యంత విశ్వసనీయమైనది. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రభూమి, సూర్య పత్రికలు ఇలా అక్రమార్జనకు పాల్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రెస్ కౌన్సిల్ కు ఇటీవల నివేదిక సమర్పించినట్టు మెయిల్ టుడే పత్రిక రాసింది.
" ఈ విధంగా డబ్బు తీసుకుని ప్రకటనలు రాయడాన్ని సరోగేట్ అడ్వర్టయిజ్ మెంట్ లుగా పరిగణిస్తారు. కానీ ఈ పత్రికలు యాడ్స్ ను వార్తలుగా రాశాయి కాబట్టి పెయిడ్ న్యూస్ గా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ పరిగణిస్తోంది" అని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సెక్రటరీ జనరల్ కె శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ పత్రికలపై వచ్చిన అభియోగాలపై ప్రెస్ కౌన్సిల్ నియమించిన విచారణ సంఘంలో శ్రీనివాసరెడ్డి ఒక సభ్యుడు కూడా.
ఎన్నికల కమిషన్ కు ఖర్చు చూపించకుండా ఉండడానికి, ప్రజల్లో క్రెడిబిలిటీ పొందడానికి ఈ పెయిడ్ యాడ్స్ రాజకీయ పార్టీల అభ్యర్ధులకు ఉపయోగపడ్డాయి. అందువల్లనే అంత బ్లాక్ మనీ పత్రికల యాజమాన్యాలకు దక్కింది. అభ్యర్ధుల ప్రకటనలను డేట్ లైన్, క్రెడిట్ లైన్ పెట్టి పాఠకులు వాటిని వార్తలు అనుకునే విధంగా ప్రచురించారు. పత్రికా యాజమాన్యాలకు డబ్బులు ఇచ్చిన ఆయా అభ్యర్ధులు గెలవబోతున్నట్టు ఆ పెయిడ్ వార్తలను ప్రచురించారు. మార్చి 31 న ప్రెస్ కౌన్సిల్ ఈ నివేదికపై తన అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశముంది.