విజయవాడ సిపి వినూత్న ప్రయోగాలు
ఆయా జిల్లాల్లో ఏ చిన్న ఘటనకు పాల్పడాలన్నా అప్పట్లో నేరస్తులు, రౌడీలు బెంబేలెత్తేవారు. విజయవాడ నగర సీపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పీఎస్ఆర్ ఆంజనేయులు నగరంలోని రౌడీ షీటర్లపై పూర్తిగా దృష్టిసారించారు. ఎప్పుడో 70వ దశకంలో చలసాని వెంకటరత్నం, వంగవీటి రాధా కేసుల్లో నిందితులు, 80వ దశకంలో వంగవీటి మోహనరంగా, దేవినేని మురళి కేసుల్లో నిందితులుగా పేర్కొన్న వారిపై కూడా నేటికీ రౌడీషీట్లు ఉండటాన్ని గుర్తించారు. వీరిలో కొందరు వయసు పైబడి అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉంటే మరికొందరు ఆదరించేవారు లేక పొట్టకూటి కోసం చిన్న పాటి పనులు చేసుకొని జీవిస్తున్న వారున్నారు.
ఏళ్లతరబడి ఏ విధమైన కేసులు లేకుండానే రౌడీషీటరుగా ముద్రపడ్డ వారిని కూడా పోలీసు కమిషనర్ గుర్తించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని బుధవారం 'రౌడీల మేళా" నిర్వహిం చి 90 మందిపై రౌడీషీట్లు ఎత్తేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారిపై కొద్ది రోజుల పాటు నిఘా కొనసాగించి మంచి నడవడికతో ఉన్నారంటే షీటు తొలగిస్తామంటూ మేళాకు హాజరైన వారికి భరోసా ఇవ్వ డం పలువురిలో ఆనందాన్ని కలిగించింది. రౌడీ చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లే దంటూ 'డార్మిటరీ" కౌన్సిలింగ్తో హెచ్చరిస్తూనే నగర అభివృద్ధికి అవసరమైన పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టేవారు భయపడాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇస్తున్నారు.