కెవిపిని పక్కన పెట్టిన కాంగ్రెసు హైకమాండ్?
రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో కెవిపికి స్థానం దక్కకపోవడమే కెవిపిని దూరం పెట్టాలని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటునడానికి నిదర్శనమని అంటున్నారు. గతంలో ఓసారి సమన్వయ కమిటీని వేసినప్పుడు కెవిపి రామచందర్ రావుకు పార్టీ అధిష్టానం స్థానం కల్పించింది. ఈసారి వేసిన సమన్వయ కమిటీలో ఆయన లేరు. ఆయన స్థానంలో చిరంజీవి వచ్చినట్లు కనిపిస్తోంది. చిరంజీవికి ప్రాధాన్యం పెంచుతూ కెవిపి ప్రాధాన్యం తగ్గించడమనే వ్యూహాన్ని కాంగ్రెసు అధిష్టానం అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.
కెవిపి రామచందర్ రావు శుక్రవారం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీని కలిశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మొయిలీ హైదరాబాద్ వచ్చారు. మొయిలీ గతంలో కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు. ఆయన స్థానంలో గులాం నబీ ఆజాద్ను అధిష్టానం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా నియమించింది. దీంతో మొయిలీ హైదరాబాదు వచ్చినప్పటికీ పార్టీ వ్యవహారాలపై మాట్లాడలేదు. తెలంగాణపై కూడా తాను మాట్లాడేదేమీ లేదని తప్పించుకున్నారు. తనకు ప్రాధాన్యం తగ్గిన నేపథ్యంలోనే కెవిపి రామచందర్ రావు మొయిలీని కలిసి మాట్లాడినట్లు చెబుతున్నారు.