కిరణ్ ఏదో పొడిచేస్తారని అనుకుంటే...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి దీటైన జవాబిస్తారని, తెలంగాణ ఉద్యమం రగులుకోకుండా చూస్తారని భావిస్తే ఆయన వల్ల అది సాధ్యం కావడం లేదని అంటున్నారు. సకల జనుల సమ్మెను విరమింపజేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని అధిష్టానం భావిస్తోంది. రోశయ్య వల్ల కావడం లేదని భావించి కాంగ్రెసు అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే, రోశయ్య హయాంలో ఏ విధమైన పరిస్థితి ఉందో ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పైగా, పరిస్థితి మరింత విషమించింది. సమస్యలను గాలికి వదిలేసి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటనలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడడం లేదని, సమస్యల పరిష్కారానికి నలుగురితో చర్చించి మాట్లాడాలనే ఉద్దేశం కూడా ఆయనకు లేదని అంటున్నారు. పైగా, మంత్రులను కూడా సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కూడా సమస్య తీవ్రతకు కారణమవుతోందని అంటున్నారు. మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నవంబర్ 1వ తేదీ నుంచి రూపాయికి కిలో సబ్సిడీ బియ్యం పథకాన్ని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. కానీ, ఆ పథకాలను మిగతా మంత్రులు గానీ, పార్టీ నాయకులు గానీ పట్టించుకోవడం లేదు. తమతో సంప్రదించినప్పుడు తమకేమీ పట్టిందనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నారు.
అయితే, కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం లేదని అంటున్నారు. మరోసారి ముఖ్యమంత్రిని మారిస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందనే భావనతో ఉంది. అదే కిరణ్ కుమార్ రెడ్డికి శ్రీరామరక్షగా మారిందని చెబుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించడానికి కూడా పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదని అంటున్నారు.