విద్యార్థులపై 'కార్పొరేట్' తోముడు
కార్పొరేట్ కళాశాలలు పక్కా వ్యాపారదృష్టితో ఇంటర్మీడియట్ విద్యను పెంచి పోషిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకుంటున్నాయి. వేలాదిగా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఐఐటి - జెఇఇకి, ఎఐఇఇఇ ప్రవేశ పరీక్షకు, ఎంసెట్కు ఈ విద్యాసంస్థలు విద్యార్థులను సిద్ధం చేస్తున్నాయి. పిల్లలు ఈ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారనే ఆశ కొద్ది తల్లిదండ్రులు ఈ విద్యాసంస్థల్లో చేరుస్తున్నారు. అయితే, ఈ విద్యా సంస్థలు కొద్ది మందిని ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. ర్యాంకులు సాధించే తెలివితేటలు ఉన్న విద్యార్థులను తీసుకుని ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. మిగతా విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజుల సొమ్ములో చాలా భాగం వీరి కోసం ఖర్చు చేస్తున్నాయి.
మామూలు విద్యార్థులకు, సగటు విద్యార్థులకు ఈ విద్యాసంస్థల్లో సరైన బోధన ఉండదు. సరైన అధ్యాపకులను నియమించరు. నెలల తరబడి సబ్జెక్టు లెక్చరర్లు లేకుండానే నడిపిస్తారు. విద్యార్థులు అడిగితే వేధింపులు ప్రారంభమవుతాయనే ఆరోపణలున్నాయి. ఇటు తల్లిదండ్రులకు కూడా విద్యాసంస్థ యాజమాన్యాలకు భయపడి పిల్లలు సమాచారం ఇవ్వడం లేదు. దీంతో సగటు విద్యార్థుల దారి సగటు విద్యార్థులది అవుతోంది. కొద్ది మంది ర్యాంకుల ద్వారా ఈ విద్యాసంస్థలు వాణిజ్య ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. మిగతా విద్యార్థులు తమ సొంత ప్రతిభ మీద ఆధారపడి వివిధ కోర్సుల్లో సీట్లు సంపాదించుకుంటున్నారు. పక్కా వ్యాపార ధోరణితో కార్పొరేట్ కాలేజీలు నడుస్తున్నాయి. మెజారిటీ విద్యార్థులను గాలికి వదిలేసి పిడికెడు విద్యార్థులపై శక్తిని, సొమ్మును ధారపోస్తున్నాయి.