వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీ వర్సెస్ ఆఫ్రిదీ: ఎవరిది పైచేయి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahendra Singh Dhoni-Shahid Afridi
దాయాదుల పోరు అంటే ఆసక్తి, ఉత్కంఠ ఉంటుంది. ఉపఖండం క్రికెట్ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఆభిమానులకు కూడా ఈ పాకిస్తాన్, భారత్ క్రికెట్ జట్ల మధ్య పోరు ఆసక్తి కలిగిస్తుంది. ఈ రెండు జట్లు మొహాలీ స్టేడియంలో ఈ నెల 30వ తేదీన మోహరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చండీఘర్‌లోని హోటళ్లన్నీ పూర్తిగా బుక్కయ్యాయి. మొహాలీకి పది కిలోమీటర్ల దూరంలో ఉండే చండీఘర్‌ క్రికెట్ అభిమానులతో, క్రికెట్ పెద్దలతో క్రిక్కిరిసిపోయింది. ఈ రెండు జట్ల మధ్య పోరు రక్తం ఉరకలెత్తే విధంగా సాగుతుందనడంలో ఆశ్చర్యం లేదు. భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీల మధ్య జరిగే ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనే చర్చ ఇప్పటికే ప్రారంభమైంది.

ఈ ప్రపంచ కప్ పోటీల్లో ఆఫ్రిదీ సేన దూకుడుగా ముందుకు సాగుతోంది. పోటీలు ప్రారంభమైన మొదటి రోజుల్లో ఆఫ్రిదీపైనే పూర్తిగా జట్టు విజయం ఆధారపడి ఉందనే అభిప్రాయం కలిగింది. ఆఫ్రిదీ ఒక్కడిపై ఆధారపడిన పాకిస్తాన్ ఎన్నాళ్లు పోటీల్లో కొనసాగుతుందనే అనుమానాలు కూడా రేకెత్తాయి. అయితే, క్రమంగా జట్టు సభ్యులు పుంజుకున్నారు. ఎవరికి వారు తమ వంతు పాత్ర నిర్వహించడానికి కుదురుకున్నారు. ఆస్ట్రేలియాపై విజయంతో ఒక్కసారిగా పాకిస్తాన్‌పై అంచనాలు పెరిగాయి. పాకిస్తాన్ స్పిన్నర్లు ఆస్ట్రేలియా జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. పాకిస్తాన్ జట్టులో చాలా కాలం తర్వాత దూకుడు కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం పెరిగింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నైతికంగా కూడా బలహీనపడుతూ వచ్చిన పాకిస్తాన్ జట్టును అఫ్రిదీ దాని నుంచి బయట పడేసినట్లే కనిపిస్తున్నాడు.

ఇకపోతే, మహేంద్ర సింగ్ ధోనీ సేన ఆస్ట్రేలియాను ఇంటికి పంపించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియాను ఓడించిన ఘనత పాకిస్తాన్, ఇండియాలకే దక్కుతుంది. ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా ధోనీ సేన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. అయితే, బౌలింగ్‌లో భారత్ ఇప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భారత బ్యాట్స్‌మెన్ అఫ్రిదీ దూకుడును, స్పిన్నర్ల దాటిని ఏ మేరకు ఎదుర్కోగలరనేది సందేహంగానే ఉంది. అయితే, యువరాజ్ సింగ్ అటు బౌలింగులోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండడం ఈ టోర్నమెంటులో భారత్ బలం. యువీ ఓ నమ్మకమైన ఆటగాడిగా రూపుదిద్దుకున్నాడు.

అయితే, తుది జట్టులోకి సురేష్ రైనాను తీసుకోవాలా, యూసుఫ్ పఠాన్‌ను నమ్ముకోవాలా అనేది ధోనీకి అంతు పట్టని విషయంగానే ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో సురేష్ రైనా ప్రదర్శించిన సమయానుకూలత, సందర్భానికి అనుగుణంగా బ్యాటింగ్ చేసిన తెలివి ఆకట్టుకుంది. సురేష్ రైనా బౌలింగ్ కూడా చేయగలడు. అందువల్ల సురేష్ రైనానే తుది జట్టులోకి తీసుకునే అవకాశాలుంటాయి. కానీ, ఇరు జట్లలో ఏది గెలుస్తుందనేది అంచనా వేయడం అంత సులభం కాదు. బలాలు, బలహీనతలు సమానంగా ఉన్న జట్లలో జయాపజయాలు ఆ రోజు ఆ జట్లు ప్రదర్శించే ఆటతీరును బట్టే ఉంటుంది.

English summary
The semi final match between India and Pakistan will be very interesting. Chandigarh is already packed with Cricket fans and cricket officials. The strengths of the two teams are balanced. It is not easy estimate, which team will win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X