ధోనీ వర్సెస్ ఆఫ్రిదీ: ఎవరిది పైచేయి?
ఈ ప్రపంచ కప్ పోటీల్లో ఆఫ్రిదీ సేన దూకుడుగా ముందుకు సాగుతోంది. పోటీలు ప్రారంభమైన మొదటి రోజుల్లో ఆఫ్రిదీపైనే పూర్తిగా జట్టు విజయం ఆధారపడి ఉందనే అభిప్రాయం కలిగింది. ఆఫ్రిదీ ఒక్కడిపై ఆధారపడిన పాకిస్తాన్ ఎన్నాళ్లు పోటీల్లో కొనసాగుతుందనే అనుమానాలు కూడా రేకెత్తాయి. అయితే, క్రమంగా జట్టు సభ్యులు పుంజుకున్నారు. ఎవరికి వారు తమ వంతు పాత్ర నిర్వహించడానికి కుదురుకున్నారు. ఆస్ట్రేలియాపై విజయంతో ఒక్కసారిగా పాకిస్తాన్పై అంచనాలు పెరిగాయి. పాకిస్తాన్ స్పిన్నర్లు ఆస్ట్రేలియా జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. పాకిస్తాన్ జట్టులో చాలా కాలం తర్వాత దూకుడు కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం పెరిగింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నైతికంగా కూడా బలహీనపడుతూ వచ్చిన పాకిస్తాన్ జట్టును అఫ్రిదీ దాని నుంచి బయట పడేసినట్లే కనిపిస్తున్నాడు.
ఇకపోతే, మహేంద్ర సింగ్ ధోనీ సేన ఆస్ట్రేలియాను ఇంటికి పంపించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియాను ఓడించిన ఘనత పాకిస్తాన్, ఇండియాలకే దక్కుతుంది. ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా ధోనీ సేన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. అయితే, బౌలింగ్లో భారత్ ఇప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భారత బ్యాట్స్మెన్ అఫ్రిదీ దూకుడును, స్పిన్నర్ల దాటిని ఏ మేరకు ఎదుర్కోగలరనేది సందేహంగానే ఉంది. అయితే, యువరాజ్ సింగ్ అటు బౌలింగులోనూ ఇటు బ్యాటింగ్లోనూ రాణిస్తుండడం ఈ టోర్నమెంటులో భారత్ బలం. యువీ ఓ నమ్మకమైన ఆటగాడిగా రూపుదిద్దుకున్నాడు.
అయితే, తుది జట్టులోకి సురేష్ రైనాను తీసుకోవాలా, యూసుఫ్ పఠాన్ను నమ్ముకోవాలా అనేది ధోనీకి అంతు పట్టని విషయంగానే ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో సురేష్ రైనా ప్రదర్శించిన సమయానుకూలత, సందర్భానికి అనుగుణంగా బ్యాటింగ్ చేసిన తెలివి ఆకట్టుకుంది. సురేష్ రైనా బౌలింగ్ కూడా చేయగలడు. అందువల్ల సురేష్ రైనానే తుది జట్టులోకి తీసుకునే అవకాశాలుంటాయి. కానీ, ఇరు జట్లలో ఏది గెలుస్తుందనేది అంచనా వేయడం అంత సులభం కాదు. బలాలు, బలహీనతలు సమానంగా ఉన్న జట్లలో జయాపజయాలు ఆ రోజు ఆ జట్లు ప్రదర్శించే ఆటతీరును బట్టే ఉంటుంది.