వైయస్ చేవెళ్ల చెల్లెమ్మ, ప్రియమిత్రుడు టార్గెట్
మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుండగా, గతంలో సిబిఐ విచారణ తీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేసిన శంకరరావు కెవిపిని టార్గెట్ చేసుకున్నట్లు కనిపించారు. ఒక్క శాఖలో తప్పు జరిగితే ఆ శాఖకు సంబంధించిన మంత్రి బాధ్యత ఉన్నట్లేనని డిఎల్ రవీంద్రా రెడ్డి బుధవారంనాడు వ్యాఖ్యానించారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మైనింగ్ లీజుల మంజూరు విషయంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్లను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి కూడా బాధ్యత వహించాల్సిందేనని ఆయన మాటలు తెలియజేస్తున్నాయి.
ఇక, అధికారులను మాత్రమే సిబిఐ లక్ష్యం చేసుకుందని గతంలో పి. శంకరరావు అన్నారు. నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించినవారిని సిబిఐ పట్టించుకోవడం లేదని కూడా ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్న అన్ని నిర్ణయాల్లో కెవిపి రామచందర్ రావు పాత్ర ఉందనే ఆరోపణలు మొదటి నుంచీ వస్తున్న విషయం తెలిసిందే. దీన్నిబట్టి కెవిపి రామచందర్ రావుపై కూడా సిబిఐ దృష్టి పెట్టాలనే అభిప్రాయం శంకరరావు మాటల్లో వ్యక్తమైంది. మొత్తం మీద, సిబితా ఇంద్రారెడ్డి, కెవిపి రామచందర్ రావులకు సిబిఐ కేసుల వల్ల ఇక్కట్లు తప్పకపోవచ్చుననే మాట వినిపిస్తోంది.