వైయస్ జగన్ బలం నిరూపించుకున్నారా?
కాంగ్రెసు నాయకుల మాటల్లో కూడా కొంత మేరకు నిజం ఉండవచ్చు. తాను కాంగ్రెసు వైపే ఉంటానంటూ ప్రకటన చేసిన శానససభ్యుడు ఆదినారాయణ రెడ్డి కూడా గురువారం జరిగిన జగన్ వర్గం శాసనసభ్యుల సమావేశానికి హాజరయ్యారు. మరి కొంత మంది కాంగ్రెసు వైపు తిరిగి వెళ్లడానికి మొగ్గు చూపుతూ ఉండవచ్చు. కానీ, జగన్ వర్గం ఎమ్మెల్యేల సమావేశం మాత్రం పూర్తిగా విఫలం కాలేదు, ఒక రకంగా విజయవంతమైందనే చెప్పాలి. ఇరవై మంది శాసనసభ్యులు సమావేశానికి హాజరయ్యారు.
అయితే, సమావేశం వెనక కసరత్తు చాలానే జరిగిందని అంటున్నారు. శాసనసభ్యులను రప్పించడానికి తెర వెనక వ్యూహాలు, బుజ్జగింపులు చాలానే జరిగినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధవు వైవి సుబ్బారెడ్డి శాసనసభ్యులను తమ నుంచి జారిపోకుండా చూడడంలో ప్రధాన పాత్ర పోషించారని అంటున్నారు. సమావేశం రావడానికి ముందు కొంత మంది శాసనసభ్యులు సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు కూడా. ఆయనతో మాట్లాడిన తర్వాతనే వారు సమావేశానికి వచ్చారు. మొత్తం మీద, పట్టుబట్టి సమావేశం ఏర్పాటు చేసి జగన్ తన బలం పూర్తిగా తగ్గలేదని నిరూపించుకున్నారని అంటున్నారు. అయితే, ఇంకా కొంత మందిలో ఊగిసలాట ధోరణి కొనసాగుతోందని అంటున్నారు.