ఆత్మగౌరవంపై వైయస్ జగన్ స్వారీ
దానికి తోడు, వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి ఆయన ఏ విధమైన అవకాశాన్ని కూడా వదులుకోలేదు. వైయస్సార్ వారసులమని చెప్పుకోవడానికి కాంగ్రెసు నాయకులు చేసిన ప్రయత్నాలను ఆయన తీవ్రంగా తిప్పికొట్టారు. వైయస్ వారసులైతే వైయస్ పథకాలకు ఎందుకు గండికొడుతున్నారని అడిగారు. వైయస్ అమలు చేసిన పథకాలు కాంగ్రెసు పథకాలే అని కాంగ్రెసు నాయకులు చెప్పుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెసు పథకాలే అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడంలేదని అడిగారు. ఆ రకంగా వైయస్సార్ రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి పట్టుదలతో వ్యవహరించారు. తమ కుటుంబం పట్ల సోనియా వ్యవహరించిన తీరుకు గుణపాఠం చెప్పారని ఆయన భావిస్తున్నారు.
కాంగ్రెసు అధిష్టానం కిరాతకత్వానికి, ఉద్వేగానికి మధ్య ఎన్నికలు జరిగాయని, తన తండ్రి చనిపోయి రెండేళ్లవుతోందని, సెంటిమెంటు ఇప్పటి దాకా ఉండదని జగన్ అన్నారు. తన కుటుంబాన్ని చీల్చడానికి చేసిన కుట్రను ప్రజలు వ్యతిరేకించారని ఆయన చెప్పారు. విజయమ్మకు సోనియా గాంధీ ఆపాయింట్మెంట్ ఇవ్వడానికి నెల రోజులు తీసుకోవడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారని కూడా ఆయన అంటున్నారు.
మొత్తంగా ఆత్మగౌరవ నినాదమే జగన్ ప్రధాన నినాదంగా మారనుంది. 1983లో ఎన్టీ రామరావు ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తెచ్చి కాంగ్రెసు పునాదులు కదిలించారు. అలాగే, ఇప్పుడు కదిలించాలనేది వైయస్ జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.