శ్రీకృష్ణ నివేదికపై ఆలస్యం అందుకేనా?
ఆందోళనలు ఇలాగే కొనసాగితే రాష్ట్రం పరిస్థితి అధ్వాన్నంగా తయారవడమే కాకుండా, కాంగ్రెసు పార్టీపై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగించాలంటే ఆందోళనలు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆందోళనలు తగ్గించాలంటే తెలంగాణపై ఏదో ఒకటి సాధ్యమైనంత తొందరగా తేల్చాలి. ముఖ్యమంత్రి కిరణ్ సైతం అధిష్టానాన్ని తెలంగాణపై తేల్చాలని కోరారు. త్వరలో ఉన్న ఎమ్మెల్సీల జాబితాతో వెళ్లిన ముఖ్యమంత్రి అంతకంటే ముఖ్యంగా తెలంగాణ అంశంపై తేల్చాలని కేంద్రాన్ని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ తాను కట్టుబడి ఉంటానని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే తెలంగాణలో ఆందోళనలు తగ్గించే దృష్టితో సీమాంధ్రులలో గత 2009 మాదిరిగా ఆందోళనలు చెలరేగకుండా నిర్ణయం తీసుకునే దిశలో ఆలోచిస్తుంది.
తెలంగాణలో ఉన్న భావోద్వేగాలను తగ్గించడమే ప్రస్తుత కర్తవ్యంగా అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణలో నెలకొన్న భావోద్వేగాలను తగ్గించి తద్వారా ఆందోళనలు, రాస్తారోకోలు, సహాయ నిరాకరణలకు చెక్ చెప్పాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే తెలంగాణ చల్లబడినా 2009లో మాదిరి సీమాంధ్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి గతంలో లాగా తప్పు చేయకుండా సీమాంధ్రులను నొప్పించకుండా, తెలంగాణ ప్రజల భావోద్వేగాలను తగ్గించడమే తక్షణ కర్తవ్యంగా ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టుంది. అందుకే శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఇచ్చాక కూడా ఇంతకాలంగా నిర్ణయం తీసుకోకుండా వెయిట్ చేస్తుంది. నిర్ణయం తీసుకోకుండా వెయిట్ చేయడానికి కారణం - సీమాంధ్రులను రెచ్చగొట్టకుండా, తెలంగాణలో భావోద్వేగాలు తగ్గించడం. ఆ దిశలోనే కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ కారణమే నివేదికపై నిర్ణయానికి ఆలస్యానికి కారణం కావచ్చు.