ఆ డబ్బుపై రత్నాకర్ కొత్త సంగతులు!
ట్రస్టు సభ్యుల మధ్య విభేదాలేమీ లేవని, ఇందులో విశ్రాంత జడ్జిలు, ఐఏఎస్ అధికారులు కొన్ని దశాబ్దాలుగా నిస్వార్థ సేవలు అందిస్తున్నారన్నారు. తాను సత్యసాయి బంధువుగా కాకుండా సేవా సంస్థ ప్రతినిధిగా సేవలందిస్తున్నానన్నారు. కొన్ని మీడియా సంస్థలు బంగారం, డబ్బు తరలిపోయిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఇది మానుకోవాలని సూచించారు. మీడియాలో ఏదో వచ్చిందని వెంటనే స్పందించడానికి తాము రాజకీయ నాయకులం కాదని, సేవా సంస్థలో పనిచేసే వారమని అన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తామన్నారు. దేశానికే గర్వకారణమైన సత్యసాయి మహోన్నత వ్యక్తి అని, అలాంటి వ్యక్తి స్థాపించిన సంస్థ సేవలు పెద్ద ఎత్తున విస్తరింపజేస్తామన్నారు.
తాను పెనుకొండ కోర్టులో లొంగిపోయానని, బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నానని లేనిపోనివన్నీ మీడియా సృష్టిస్తోన్నారు. సత్యసాయి భక్తులు 160 దేశాల్లో ఉన్నారని, సత్యసాయి సేవలు ప్రపంచ వ్యాప్తంగా పారదర్శకంగా కొనసాగుతున్నాయని చెప్పారు. తాగునీరు అందించినా, ఉచిత వైద్యం చేయిస్తున్నా అదంతా ప్రజాసేవ కోసమేనని, అందులో ట్రస్టుకు స్వార్థం లేదన్నారు. ఎవరూ ఎలాంటి అపోహలకు లోనుకావద్దని, అంతా పారదర్శకంగానే కొనసాగుతుందని, సత్యసాయి ఆశయాలను కొనసాగించేందుకే ట్రస్టు పనిచేస్తుందని పేర్కొన్నారు.