తెలంగాణ సమ్మె కట్టడికి రూ. 48 కోట్లు
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు కూడా హోం శాఖ అదనపు నిధులు మంజూరు చేసింది. హైకోర్టు వద్ద భద్రత పెంపునకు కూడా అదనపు నిధులు విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంటలిజెన్స్ అదనపు డిజికి దాదాపు 4 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఈ నిధుల ద్వారా సిసిటివి కెమెరాలను, సంబంధిత పరికరాలను కొంటారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్కు రూ. 5.54 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై జాప్యం చేయడానికి సిద్ధపడినట్లు అర్థమవుతున్న నేపథ్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. ఈ నెల 9,10,11 తేదీల్లో రైల్ రోకోను తలపెట్టింది. సకల జనుల సమ్మెను దెబ్బ తీయడానికి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సమ్మెపై అవసరమైతే బలప్రయోగం చేయాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే అదనపు నిధులు కూడా విడుదల చేసి భద్రతా చర్యలకు శ్రీకారం చుడుతోంది.