వన్డేలకు సచిన్ రాంరాం?
యువ క్రికెటర్లకు అవకాశం లబించకుండా జట్టును పట్టుకుని వేలాడుతున్నాడనే విమర్శలను సచిన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. వయస్సు మీద పడుతుంటే సాహసాలు చేయకూడదని ఆయన భావించే వీలుంది. వన్డేలకు స్వస్తి చెప్పి టెస్టు క్రికెట్లో ప్రస్తుతం కొనసాగవచ్చునని అంటున్నారు. ముంబై వేదికగా ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనందంలో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. తద్వారా సచిన్ ప్రపంచ కప్ కల నెరవేరింది. జట్టు సభ్యులు కూడా సచిన్కు ఎంతో గౌరవం ఇచ్చారు. వారి ప్రతి మాటలోనూ సచిన్ పేరునే వల్లె వేశారు. ఇదంతా సచిన్కు ఓ తీపి గుర్తు. దీన్ని ఆయన ప్రజలతో పంచుకోవాలని అనుకుంటున్నారు. ఇంతగా ప్రజల ఆదరణను, జట్టు సభ్యుల గౌరవ మర్యాదలను అందుకున్న సచిన్ టెండూల్కర్ ఈ మధుర స్మృతుల మధ్యనే వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవచ్చునని అంటన్నారు.
నిజానికి, సచిన్ టెండూల్కర్ ప్రపంచ కప్ పోటీల్లో కూడా కుర్రాళ్లతో పోటీ పడ్డారు. తగిన పరుగులు సాధించాడు. ఆయన ప్రశంసలే తప్ప విమర్శలను ఎదుర్కోలేదు. అయితే, ఈ జోరును సచిన్ ఎంత కాలం కొనసాగించగలరనేది ప్రశ్న. పటిమ తగ్గి ఆటలో పస తగ్గే ప్రమాదం లేకపోలేదు. ఆటలో విఫలమవుతూ వస్తే ఇప్పుడు బ్రహ్మరథం పట్టిన ప్రజలే విమర్శలకు పూనుకోవచ్చు. విసుగు ప్రదర్సించవచ్చు. 1983లో ప్రపంచ కప్ అందించిన కపిల్ దేవ్కు కూడా అటువంటి స్థితి తప్పలేదు. అందువల్ల ప్రజాదరణ మెండుగా ఉన్నప్పుడే తప్పుకుంటే బాగుంటుందని సచిన్ భావిస్తూ ఉండవచ్చు.