తిరుమల వేద పాఠశాలలో సెక్స్ స్కామ్
మొదట బలవంతపు అత్యాచారాలకు పాల్పడి స్వలింగ సంపర్కాన్ని అలవాటు చేస్తారు. కొందరిని మగ వ్యభిచారులుగా మార్చినట్లు కూడా తెలుస్తోంది. తిరుమల జీయర్ మఠంలోని ఓ ఏకాంగి తరచూ వేద పాఠశాలకు వచ్చి పిల్లలకు డబ్బులిచ్చి స్వలింగ సంపర్కం చేసుకుపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ధర్మగిరిలో 60 మంది అధ్యాపకులు పని చేస్తున్నారు. నిర్దేశిత డ్యూటీ ప్రకారం అధ్యాపకులు రాత్రిళ్లు పాఠశాలలోనే బస చేయాలి. కానీ చేయరు. ఇక సీనియర్ విద్యార్థులే సూపర్వైజర్లు. దీంతో జూనియర్లపై లైంగిక వేధింపులు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ ఘోరాలను ప్రశ్నించడానికి ప్రయత్నించినా, ఫిర్యాదు చేయాలనే ఆలోచన వచ్చినా సీనియర్లు రెచ్చిపోతారు. వారి ట్రంకు పెట్టెల్ని కాళ్లతో తుక్కు చేసి, కాంపౌండ్ బయట పడేస్తారు. కొత్త విద్యార్థులపై వీరే తప్పుడు ఫిర్యాదులు చేయిస్తారు. ఈ దారుణాలు భరించలేక పది సంవత్సరాల్లో వందలాది మంది కోర్సును మధ్యలోనే వదిలి వెళ్లిపోయారని అంటున్నారు. అధ్యాపకులను పాఠశాల నిర్వాహకులు నిలదీస్తే సహాయ నిరాకరణకు దిగుతారని వార్తలు వచ్చాయి. తడాఖా చూపిస్తామంటూ సెలవు పెట్టి వెళ్లిపోతారు. ఎంతకూ సిలబస్ పూర్తిచేయరు. దీంతో నిర్వాహకులు కూడా వారితో సర్దుకుపోవటమో, వారికి భాగస్వాములు కావటమో జరుగుతోంది.
ధర్మగిరిలో చేరే విద్యార్థులకు ఇటీవల టీటీడీ భారీ ప్యాకేజీలు ప్రకటించింది. దీని ప్రకారం పిల్లలు చేరగానే మూడు లక్షల రూపాయలు వారి పేరిట డిపాజిట్ చేస్తారు. ఆగమాలు నేర్చుకునేవారికి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తారు. వారు 12, 8 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేటప్పుడు ఆ మొత్తాన్ని వడ్డీతో కలిపి ఇస్తారు. ఈ సౌలభ్యాన్ని వదులుకోలేక పేద విద్యార్థులు ఇక్కడి దారుణాలపై నోరు మెదపలేక పోతున్నారు. ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో టీటీడీ అధికారులు బుధవారం వేద పాఠశాలలో పరిస్థితి చక్కదిద్దేందుకు పరిపాలనాధికారిగా సుబ్రమణ్యాన్ని నియమించారు.
శ్రీవారి ఆలయానికి అవసరమైన వేద పండితులను తయారు చేసుకోవాలనే సంకల్పంతో 1884లో వేద పాఠశాలను ప్రారంభించారు. తొలుత తిరుపతి గోవిందరాజస్వామి ఉత్తర మాడవీధిలోని ప్రస్తుత మ్యూజియంలో ప్రారంభించారు. 1951లో శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి మార్చారు. క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరగడంతో తిరుమల శిఖరభాగాన ఉన్న నారాయణగిరి కొండల్లో ధర్మగిరి వేద పాఠశాలను ఏర్పాటు చేశారు. తిరుమల వేద పాఠశాలలో ఒక విద్యార్థిపై సహ విద్యార్థులు లైంగిక వేధింపులు జరిపిన మాట వాస్తవమే టిటిడి కార్యనిర్వాహణాధికారి కృష్ణారావు అంగీకరించారు.