వెండి కూడా ప్రాణాలు తీస్తుందా?
హైదరాబాదు మార్కెట్లో బంగారం ధరనే కాదు, వెండి ధర కూడా విపరీతంగా పెరిగింది. శనివారం వెండి కిలో ధర ఒకేసారి 2,500 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం వెండి కిలో ధర హైదరాబాదు మార్కెట్లో 72 వేల 600 పలుకుతోంది. గత కొద్ది కాలంగా వెండి ధర పెరుగుతూ ఉన్నది. దీనికి కారణం స్పష్టంగా తెలియడం లేదు గానీ బంగారం ధర విపరీతంగా పెరుగుతుండడంతో వెండి వైపు మధ్యతరగతి మహిళలు చూస్తుండడం ఒక కారణమని భావిస్తున్నారు. బంగారం పది గ్రాముల ధర 22,210 రూపాలు ఉంది. బంగారంతో పాటు వెండి కూడా ఇదే రీతిలో పెరుగుతూ వస్తోంది.
సాధారణంగా మహిళలు వెండి కడియాలు, వెండి పట్టగొలుసులు, వడ్డాణం ధరిస్తారు. అయితే, వెండి కంఠాభరణాలకు బంగారు పూత పూసి కూడా ధరిస్తున్నారు. వెండి ధర కూడా తక్కువేమీ కాకపోవడంతో దొంగలు మహిళలు ధరించే వెండి ఆభరణాలపై కూడా కన్నేసినట్లు భావించవచ్చు. అయితే, వెండి ధర ఇలాగే పెరుగుతుందని చెప్పలేమని, అది ఏ క్షణంలోనైనా పడిపోవచ్చునని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. బంగారం ధరలు పెరగడం వల్ల ప్రజలు వెండిని కొనడానికి ముందుకు వస్తుండడం దాని ధర పెరగడానికి కారణమని అంటున్నారు.