రామోజీరావుకు ఉండవల్లి దెబ్బ?
తాజాగా, రామోజీ రావు తన ఈటీవి టెలివిజన్ చానెళ్లను సోనీకి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని, చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. రెండు సంస్థల మధ్య 2250 కోట్ల నుంచి 2400 కోట్ల రూపాయల మధ్య ఈ డీల్ ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ డీల్లో న్యూస్ చానెల్ ఈటివీ2 ఉండదని చెబుతున్నారు. ఈ డీల్ సోనీ - ఎంఎస్ఎం ప్రాంతీయ మార్కెట్లో బలపడేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.
జెమినీ, జీ, మా వంటి ఎంటర్టైన్మెంటు చానెళ్లు తమ తమ డైలీ సీరియళ్లు, కొత్త రకం కార్యక్రమాల ద్వారా దూసుకుపోతున్నాయి. ఈ విషయంలో రామోజీరావుకు చెందిన ఈటీవీ చానెళ్లు వెనకబడిపోయాయని అంటున్నారు. దానికి కారణాలను అన్వేషించినా అందులోంచి బయటపడే పరిస్థితి కూడా లేదని అంటున్నారు. దీంతో వాటిని సోనీకి విక్రయించేందుకు రామోజీ రావు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.