అనుమానాలు తీర్చని సత్య సాయి ట్రస్టు?
ట్రస్టు ఆస్తుల విలువపై కూడా మద్రాసు శ్రీనివాసన్ ఇష్టపడలేదు. ఆస్తుల విలువను అంచనా వేయలేమని, మార్కెట్ విలువను గణనలోకి తీసుకుని అలా లెక్క కట్టడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. ట్రస్టు ఏటా వంద కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేస్తుందని ఆయన చెప్పారు. ట్రస్టు ఆస్తుల విలువ 40 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ట్రస్టు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లే కనిపించారు. జమాఖర్చుల లెక్కలు పారదర్శకంగా ఉన్నాయని మాత్రమే చెప్పారు. ఆభరణాలు, నగల తరలింపు, కొల్కత్తాలో ఆస్తుల లావాదేవీలు వంటి వ్యవహారాలేమీ జరగలేదని మాత్రమే ట్రస్టు సభ్యులు చెప్పారు.
ఏప్రిల్ 1వ తేదీననే శవపేటికకు ఆర్డర్ ఇచ్చారని, అది ఐదో తేదీననే పుట్టపర్తికి చేరుకుందని వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వడానికి కూడా సభ్యులు నిరాకరించారు. ఓ భక్తుడు దానికి ఆర్డర్ ఇచ్చాడని, దాని గురించి తమకు తెలియదని మద్రాసు శ్రీనివాసన్ చెప్పారు. అయితే, ఆ వ్యవహారాన్నంతా నడిపింది ఎవరనే విషయంపై వివరణ ఇవ్వడానికి ట్రస్టు సిద్ధంగా లేదనేది అర్థమవుతోంది. అలాగే, మార్చి 28వ తేదీన ఆస్పత్రిలో చేర్చడానికి ముందు సత్య సాయి బాబాకు అందించిన చికిత్సపై మద్రాసు శ్రీనివాసన్ జవాబు చెప్పలేదు. అది తమ పరిధిలో లేదని ఆయన చెప్పారు. తనకు ఏ విధమైన చికిత్స అందించాలనే విషయంపై సత్య సాయి బాబానే స్వయంగా వైద్యులను సంప్రదించేవారని, ఇందులో తమ ప్రమేయం లేదని ఆయన చెప్పారు.
మొత్తం మీద, ఓ పద్ధతి ప్రకారం ఇక ముందు ట్రస్టుకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా చూసుకోవడానికి, మీడియాను అదుపులో పెట్టడానికి మీడియా సమావేశాన్ని ట్రస్టు సభ్యులు వాడుకున్నట్లు అర్థమవుతోంది. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు చేసిన వాదనలను అతి మామూలుగా కొట్టేసే ప్రయత్నం చేశారు. ఆదికేశవులు నాయుడు ట్రస్టు సభ్యుడు కారని, బాబా భక్తుడు మాత్రమేనని చెప్పడం ద్వారా ఆయన ప్రకటనలకు విలువ లేదని చెప్పకనే చెప్పారు.