లాడెన్కు అడ్డుగా నిలిచిన మహిళ
ఇప్పుడు ఆ మహిళ ఉదంతం అమెరికా, పాకిస్తాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. నిజానికి, ఆ మహిళను అమెరికా నేవీ సీల్స్ తమతో పాటు తీసుకుని వెళ్లాలని అనుకున్నారని, ఓ హెలికాప్టర్ కూలిపోవడంతో అది సాధ్యం కాలేదని వార్తలు వస్తున్నాయి. దశాబ్దం పాటు పాకిస్తాన్ లాడెన్కు రక్షణ కల్పించిందనే అభిప్రాయం అమెరికాకు కలుగుతోంది.
అమెరికా దాడి తర్వాత సదాను పాకిస్తాన్లోని రావల్పిండి ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమెను విచారించడానికి పాకిస్తాన్ అమెరికాకు అనుమతి ఇవ్వడం లేదు. కోలుకోగానే సదాను యెమెన్ పంపించి వేస్తామని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. ఆమెను యెమెన్ పంపించి వేస్తే చాలా విషయాలు లాడెన్కు సంబంధించి అమెరికాకు లభించకుండా పోతాయి.
పైగా, లాడెన్ గానీ, ఇతరులు గానీ ఆ భవనంలో అమెరికా నేవీ సీల్స్పైకి ఏ విధమైన కాల్పులు జరపలేదని తెలుస్తోంది. 13 గదులు గల భవనంలో ఆయుధాలు గానీ పేలుడు పదార్థాలు గానీ లేవు. దాన్ని బట్టి, లాడెన్ అమెరికా నేవీ సీల్స్పై దాడి చేసే అవకాశాలు లేవని అంటున్నారు. భవనంలో మాత్రం ముగ్గురి శవాలు పడి ఉన్నాయి. తాము ఆయుధాలను గానీ పేలుడు పదార్థాలను గానీ స్వాధీనం చేసుకోలేదని అమెరికా అధికారులు చెబుతున్నారు.