జగన్ బోల్తా, పారిన చంద్రబాబు పాచిక
అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు గురువారం ఏర్పాటైన జగన్ వర్గం సమావేశానికి పట్టుమని పది మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారిలో కూడా చివరి వరకు ఎంత మంది ఉంటారనేది కూడా అనుమానంగానే ఉంది. ఆరుగురు మాత్రమే జగన్ వెంట ఉండే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఆరుగురు కచ్చితంగా కాంగ్రెసుకు ఇష్టం లేనివారై ఉంటారనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం రాత్రి గుంటూరు ఓదార్పుయాత్రలో జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆశలు నీరుగారిపోయినట్లు ఆయన మాటల ద్వారానే అర్థమవుతుంది.
అదును చూసి దెబ్బ కొట్టేందుకే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఈ సందర్భాన్ని ఎంచుకున్నారని ఆయన భావిస్తున్నట్లు తెలిసిపోతూనే ఉంది. ఈ సమయంలో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలనే చంద్రబాబు యోచనలో కుట్ర ఉందని ఆయన విమర్సించారు. తన శానససభ్యులు డిస్క్వాలిఫై కావడానికే ఆయన అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎత్తులు జిత్తులు ఉంటాయనే విషయం జగన్కు తెలియంది కాదు. కానీ, ప్రత్యర్థులు కూడా తనకు అనుకూలంగా వ్యవహరించాలనే ఉద్దేశం ఆయన మాటల్లో కనిపిస్తోంది. తన వెంట నడిచే శానససభ్యులు అనర్హతకు కూడా సిద్ధపడి అవిశ్వాసానికి మద్దతిస్తారని ఆయన అన్నారు. వారు ఎంత మంది ఉంటారనేది కూడా ఆయనకు అనుమానంగానే ఉంది. అందుకే ఆయన ఆ విధంగా మాట్లాడారని అనుకోవచ్చు. ఏమైనా, జగన్ బోల్తా పడినట్లు కనిపిస్తున్నారు.