వైయస్ జగన్ పని అయిపోయినట్లేనా?
శుక్రవారం నాడే కాకుండా శనివారం నాడు కూడా వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి చేసిన ప్రకటనలు, సికింద్రాబాద్ శానససభ్యురాలు జయసుధ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటే ఉంటానని ప్రకటించడం వైయస్ జగన్ వర్గంల ఎమ్మెల్యేల ఆలోచనా తీరును తెలియజేస్తోంది. అంతేకాకుండా వారు ఎటు అడుగులు వేస్తున్నారనేది కూడా అర్థమైపోతుంది. వైయస్ జగన్ వెంటే ఉంటామని ఎవరు ఎన్నిసార్లు ప్రకటన చేసినా చాలా మంది కాంగ్రెసు వైపు తిరిగి రావడానికి మానసికంగా సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రితో డీల్ కుదరడమే తరువాయి వారు ఇటు దూకడం ఖాయమనేది తెలిసిపోతూనే ఉన్నది. ఈ స్థితిలో వైయస్ జగన్ పరిస్థితి అయిపోయినట్లే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు ఒక్కసారిగా కాకుండా వ్యూహాత్మకంగా దశలవారీగా తమ మాతృ సంస్థ వైపు రావడానికి సిద్ధపడ్డారు. జగన్కు అత్యంత సన్నిహితులైన బాలినేని శ్రీనివాస రెడ్డి, బాబూరావు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వంటివారు కూడా కాంగ్రెసు వైపు తిరిగి రావడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వ్యవహార శైలి వారిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయాలకు వైయస్ జగన్ పనికి రాడని ఆదినారాయణ రెడ్డి అనడాన్ని బట్టి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జగన్ టీ కూడా ఇవ్వడని శుక్రవారంనాడు వ్యాఖ్యానించిన ఆదినారాయణ రెడ్డి - లాబీయింగ్, ఖర్చు పెట్టడం జగన్ వల్ల కాదని శనివారంనాడు వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.
తనవైపు శాసనసభ్యులు లేకపోయినా ప్రజులున్నారని ఇటీవల వైయస్ జగన్ చేసిన ప్రకటనలోని ఆంతర్యాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. తన నుంచి శాసనసభ్యులు వెళ్లిపోతున్నారని జగన్ చెప్పకనే చెప్పారు. శాసనసభ్యులు తనను వీడిపోవడాన్ని కూడా జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. తన తండ్రిపై ప్రజల్లో ఉన్న ఆదరణ, ఇప్పుడు తనకు లభిస్తున్న ఆదరణ తనను రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని ఆయన నమ్ముతూ ఉండవచ్చు. అటువంటి నమ్మకాలు వమ్మయిన ఉదంతాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయి.