జగన్ అరెస్టుపై జోరుగా బెట్టింగులు
తొలి రోజు శుక్రవారం విచారణ సందర్భంగానే అరెస్టు చేస్తారని కొందరు, కాదు శనివారం సాయంత్రానికి అరెస్టు చేస్తారని మరికొందరు బెట్టింగులు కట్టినట్టు సమాచారముందని అంటున్నారు. శనివారం అరెస్టు చేయకపోవడంతో సోమవారం నాడు అరెస్టు ఖాయమంటూ కూడా పలువురు బెట్టింగులు కడుతున్నట్లుగా సమాచారం. కోట్ల రూపాయల్లో ఈ పందేలు జరుగుతుండడం విశేషం. జగన్ను ఈ రోజు అరెస్ట్ చేస్తారా? చేయరా? అని ఒక రోజు, రేపు చేస్తారా? 28న చేస్తారా, అసలు అరెస్ట్ చేయరా అని మరికొన్ని బెట్టింగ్లు జరుగుతున్నాయి.
బెట్టింగ్ల్లో కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, చివరకు విద్యార్థులు కూడా కడుతున్నారని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం, పరిసర గ్రామాలతో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో బెట్టింగులు జోరందుకున్నాయంటున్నారు. రాజకీయ నేతల సమన్వయంతో గణపవరం కేంద్రంగా ప్రత్యేక రహస్య కౌంటర్ ద్వారా నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ అరెస్టు ఊహాగానాలపై రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, బిక్కవోలు, అనపర్తి, మండపేట, రావులపాలెం ఏరియాలలో బెట్టింగులు కట్టినట్లు సమాచారం. జగన్ని అరెస్టు చేస్తే తీసుకోవాల్సిన చర్యలపై బిజీగా ఉన్న పోలీసులకు బెట్టింగ్ల వైపు దృష్టి సారించే సమయం లేకపోవడంతో బెట్టింగ్ గ్యాంగ్ల ఆగడాలకు అంతు లేకుండాపోతోంది.