కిరణ్ కుమార్ రెడ్డిపై బొత్స సత్తిబాబు గరం
అదే సమయంలో మద్యం సిండికేట్ల వ్యవహారంలో కూడా తనను ఇరకాటంలో పెట్టడానికి ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తోందని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్లనే ఇటీవల ఆయన ఆసహనంతో కూడిన ప్రకటన చేశారని అంటున్నారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకం విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని ఆయన అందుకే అన్నారని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారనే విషయం అధిష్టానానికి వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా అన్నారని చెబుతున్నారు.
పైగా, ఉప ఎన్నికల విషయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి బొత్స కన్నా ముందే అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఖరారు విషయంలో ఆయన అన్నీ చేయదలుచుకున్నట్లు అర్థమవుతోంది. నామ్ కే వాస్తేగా బొత్సను భాగస్వామిని చేసి తానే అంతా నడిపించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ శుక్రవారం చాలా నీరసంగా మాట్లాడారని అంటున్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సహం లభించడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారం సరిగా జరగడం లేదని ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ - పథకాల ప్రచారం ముమ్మరంగా సాగాలంటే ప్రభుత్వం పార్టీ కార్యకర్తలకు ప్రోత్సాహం అందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీన్నిబట్టి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన ఎంత గుర్రుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.