జగన్తో ఢీ: సినీ తారలతో సుబ్బిరామిరెడ్డి ఎత్తులు
ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి తాను నెల్లూరులో ఉప ఎన్నికల ప్రచారం చేస్తానని ఆయన గతంలో ప్రకటించారు. అదే సమయంలో విశాఖలో చేసిన అభివృద్ధిని తాను నెల్లూరులో కూడా చేస్తానని, ఇక నెల్లూరు కూడా తన సొంత స్థానమని ఆయన చెప్పారు. పలుకుబడి, డబ్బు తదితరాల పరంగా టిఎస్సార్ వైయస్సార్ కాంగ్రెసుకు ఏమాత్రం తీసిపోరు. అయితే ప్రస్తుతం జగన్కు సానూభూతి పవనాలు వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయనను ధీటుగా ఎదుర్కొనేందుకు తనకు అందుబాటులో ఉన్న అన్నింటిని టిఎస్సార్ నెల్లూరులో ప్రయోగిస్తున్నారని అంటున్నారు.
సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్ నెల్లూరు శాఖను ఆయన ఆదివారమే ప్రారంభించారు. ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఆయన దీనిని హఠాత్తుగా ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. మోహన్ బాబును నట వాచస్పతి బిరుదుతో గౌరవించడం అందులో భాగమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నటీనటులు వచ్చారు. దాదాసాహేబ్ పాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు, మురళీ మోహన్, రాజశేఖర్, జీవిత, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, పరుచూరి బ్రదర్స్, అలీ, శ్రద్ధాదాస్, దీక్షా సేథ్, పూనం కౌర్, అర్చన, వాణిశ్రీ తదితరులు వచ్చారు.
సినీ గ్లామర్ టచ్ ఇచ్చి నెల్లూరు వాసులను అకట్టుకునే ఉద్దేశ్యంలో భాగంగానే ఆయన అక్కడ దీనిని ఏర్పాటు చేశారంటున్నారు. ఆయనకు ఇటు సినీ రంగంతోనూ, అటు రాజకీయ రంగంతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టిఎస్సార్ వైయస్సార్ కాంగ్రెసును రాజకీయంతో పాటు సినీ గ్లామర్తోనూ ఎదుర్కోవాలని చూస్తున్నారని అంటున్నారు. టిఎస్సార్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సాధారణమేనని, అయితే ఉప ఎన్నికల సమయంలోనే నెల్లూరులో ప్రారంభించడం మాత్రం వ్యూహంలో భాగమే అంటున్నారు.
బిరుదు ప్రధాన సమయంలో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం అంటే హెచ్ఐవి జబ్బు కన్నా ప్రమాదమైనదని చెప్పారు. నా కులం వాళ్లే నాకు ఓటు వేయమని, నా కులం వాళ్లే నా హోటల్కి రండి అని, నా కులం వాళ్లే నా సినిమా చూడండని కొంతమంది అగ్గిపుల్ల గీసి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. నిజాలు నిర్భయంగా మాట్లాడటం తనకు తెలుసునని, కొందరు కులం పేరుతో అగ్గి పెడుతున్న కారణంగా వారికి బుద్ధి చెప్పేందుకే తన శ్రీ విద్యానికేతన్ సంస్థలలో 25 శాతం పేదలకు సీట్లు ఇస్తున్నట్లు చెప్పారు.
మోహన్ బాబు రాజకీయ ప్రసంగం చేశారు. టి.సుబ్బిరామి రెడ్డి నెల్లూరు వాసి అని ఆయనను ఆదరించాలని చెప్పారు. టిఎస్సార్ విశాఖకు అనేక సదుపాయాలు కల్పించారని చెప్పారు. పలు పార్టీల వారు వచ్చి ఓటు వేయమని అడిగితే అన్ని పార్టీల వారి చెప్పేవి సావధానంగా విని, ఆ తర్వాత మన విచక్షణా జ్ఞానంతో ఓటు వేయాలని చెప్పారు.