కెఎ పాల్ ఎలా పట్టుబడ్డాడు?
తమ్ముడు డేవిడ్ రాజు హత్య జరిగి రెండేళ్లయిన తర్వాత పాల్ ఎలా పోలీసులకు చిక్కాడనేది, ఆయనపై పోలీసులకు ఎలా సాక్ష్యాలు దొరికాయనేది ఆసక్తికరంగా మరింది. డేవిడ్ రాజు హత్య కేసులో కెఎ పాల్ సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం తెల్లవారు జామున ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఆయనకు రిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఇంటి వద్ద మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. ఆయనకు జిల్లా న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.
కెఎ పాల్ది విజయనగరం జిల్లా నెల్లమర్ల మండలం సారిపల్లి గ్రామం. డేవిడ్ రాజుకు, పాల్కు మధ్య భోగాపురంలోని గీంసిటీకి సంబంధించిన వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. డేవిడ్ రాజు కుమారుడు సాల్మన్ రాజు ప్రేమ వివాహం కూడా ఓ కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. సాల్మన్ రాజు ప్రేమ వివాహాన్ని డేవిడ్ రాజు వ్యతిరేకించారని అంటారు. డేవిడ్ రాజుతో మిగతా కొంత మంది కలిసి హైదరాబాదులోని అమీర్పేటలో గల వైట్హౌస్ లాడ్జిలో ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు సమావేశమయ్యారని తెలుస్తోంది.
వైట్ హౌస్ నుంచి డేవిడ్ రాజు కారులో బయలుదేరినట్లు తెలిసింది. అతనితో పాటు ఉన్నవారు మార్గమధ్యంలో ఆయనను హత్య చేసి మహబూబ్నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి గ్రామం వద్ద కారులో అతన్ని వదిలేసినట్లు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు 2010 ఫిబ్రవరిలో 8 మందిని అరెస్టు చేశారు. డేవిడ్ రాజు హత్య కేసులో కోటేశ్వర రావు అనే వ్యక్తి కూడా నిందితుడని చెబుతున్నారు. కోటేశ్వర రావు ఇటీవలి కాలంలో పాల్ను బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడని అంటున్నారు.
కోటేశ్వర రావుపై కెఎ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడ్ని ప్రశ్నించడంతో డేవిడ్ రాజు హత్యలో పాల్ ప్రమేయం బయటపడిందని చెబుతున్నారు. డేవిడ్ రాజు హత్యలో తన ప్రమేయాన్ని కోటేశ్వర రావు అంగీకరిస్తూ అన్ని విషయాలు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు పాల్ను అరెస్టు చేశారని అంటున్నారు. పాల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని కోటేశ్వర రావు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కోటేశ్వర రావు ద్వారానే పాల్ పట్టుబడినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.