కడప ఫైట్: జగన్, కందుల ఫేస్ టు ఫేస్
మంత్రులంతా మోహరించినా, ప్రత్యేక పథకాలతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినా ఫలితం కనిపించకపోగా పరిస్థితి మరింత దిగజారిపోతోంది. గతంలో వైయస్ వెంట ఉన్న కాంగ్రెస్ నేతలంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోతున్నారు. దీంతో పులివెందుల కాంగ్రెస్ ఖాళీ అయిపోతోంది. పైగా మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అసంతృప్తితో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైయస్ కుటుంబానికి రాజకీయ పునాదిగా ఉన్న పులివెందుల నియోజకవర్గం నుండి పార్టీకి కాయకల్ప చికిత్స ప్రారంభించడానికి అధిష్టానం వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి రాజకీయ విరోధి కందుల శివానందరెడ్డిపై కాంగ్రెసు నాయకత్వం కన్నేసింది.
తెలుగుదేశం పార్టీకి తిలోదకాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ద్వారా లక్ష్యం సాధించాలని ప్రయత్నం చేస్తోంది. వారిలో కాంగ్రెస్ వర్గీయులను రప్పించడానికి కందులను నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా కందుల శివానందరెడ్డి సోదరుడు పారిశ్రామిక వేత్త కందుల రాజమోహన్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు డిసిసి అధ్యక్షునిగా కొనసాగిన బిసి వర్గానికి చెందిన యువనేత, వైఎస్ రాజశేఖర్రెడ్డి శిష్యుడు మాకం అశోక్కుమార్ విముఖత వ్యక్తం చేయడంతో గతంలో డిసిసి అధ్యక్షుడిగా పని చేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని కందులకు పగ్గాలు అప్పగించారు.
ఇటీవల కందుల సోదరులు కిరణ్కుమార్రెడ్డి, బొత్సలకు మరీ దగ్గరయ్యారు. దీంతో డిసిసి పగ్గాలు శివానందరెడ్డి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. జిల్లావ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గం నేతలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి వలస వెళ్లారు. వారంతా వైఎస్ రాజశేఖర్రెడ్డితో, జగన్మోహన్రెడ్డి ద్వారా లబ్ధిపొందారు. వైయస్సార్ కాంగ్రెసుతో కలిసిపోయారు. దీంతో కందుల శివానంద రెడ్డి ద్వారా ఆ అనుబంధాలపై వేటు వేయాలనేది ఎత్తుగడగా కనిపిస్తోంది.