కసబ్ పాటలు పాడాడు, టొమాటోలు అడిగాడు
మీడియా కథనాల ప్రకారం - బుధవారం తెల్లవారు జామున కసబ్ అసాధారణమైన కోరిక కోరాడు. తనకు టొమాటోలు కావాలని అడిగాడు. దాంతో బుట్ట నిండా టమాటోలు తెచ్చి పెట్టారు అధికారులు. మరణించే ముందు తన కుటుంబ సభ్యులను చూడాలనే అతని కోరిక నెరవేరనే లేదు. ఎరువాడ జైలులోనే అధికారులు అతని మృతదేహాన్ని ఖననం చేశారు.
కసబ్ను జైలుకు తీసుకు రావడానికి ముందే ఎరువాడ జైలు అధికారులు యుద్ధప్రాతిపదికపై ఏర్పాటు చేశారు. ఉరి వేయడానికి వాడాల్సిన తాడును సిద్ధం చేశారు. ఉరిశిక్ష అమలుకు డమ్మీ ట్రయల్ కూడా వేశారు. కసబ్ బరువును వుడెన్ బోర్డు, తాడు తట్టుకుంటుందా, తెగిపోతుందా అనేది కూడా చూసుకున్నారు.
ఉరికి సిద్ధం కావాలని కసబ్కు బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు అధికారులు చెప్పారు. తనకు అందించిన టొమాటోల బుట్టలోంచి కసబ్ ఉదయం 6 గంటల ప్రాంతంలో రెండు తీసుకుని ఒకటి తిన్నాడు. ఆ తర్వాత నమాజ్ చేశాడు, ఖురాన్ పఠించాడని తెలుస్తోంది.
బుధవారం ఉదయం మరోసారి వైద్యపరీక్షలు చేసిన వైద్యులు, ఉరికి కసబ్ ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించారు. తన కుటుంబ సభ్యులను చూడాలని కోరాడు. పాకిస్తాన్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని, కానీ అటు నుంచి స్పందన లేదని అధికారులు అతనికి చెప్పారు.
ఉరి కంభం గల గేటు వద్దనే కసబ్ మృతదేహాన్ని ఉదయం తొమ్మిది గంటలకు ఖననం చేశారు. సమాధి రహస్యాన్ని కాపాడడానికి ఆరు ఆరు బొందలు తవ్వారు. తాడు సిద్ధం చేయడం నుంచి ఉరి తీసే వరకు చేయాల్సిన పనులన్నీ జైలు సిబ్బందే చేశారు. తాను పదవీ విరమణ చేసే ముందు హ్యాంగ్మన్ అర్జున్ జాదవ్ అవన్నీ జైలు సిబ్బందికి నేర్పించాడు.