కాంగ్రెసు తెలివికి కెసిఆర్ చిత్తయ్యారా?
కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వాయలార్ రవి టిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావుతో మొదట రెండు సార్లు సమావేశం కావటం, ఆ తరువాత ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి పరిస్థితి వివరించటం, ఇది జరిగిన తరువాత సోనియా గాంధీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ఆర్థిక మంత్రి పి.చిదంబరం, హోం మంత్రి సుశీల్కుమార్ షిండేతో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ముఖ్యంగా తెలంగాణ అంశం గురించి చర్చించటంతో ఏదో జరిగిపోతోందనే భావన ఏర్పడింది. దీనికితోడుగా కెసిఆర్ కూడా ఢిల్లీలోనే తిష్ఠ వేయటంతో కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన కుదురుతున్న సూచనలు కనిపించాయని మీడియాలో వ్యాఖ్యానాలు వచ్చాయి.
కెసిఆర్ కూడా తన సన్నిహితులతో మాట్లాడుతూ ఈనెలాఖరుకు యుపిఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తాయని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గత రెండు రోజుల నుండి అకస్మాత్తుగా మాట మార్చటం ప్రారంభించారు. ఇంత కాలం తెలంగాణపై సానుకూలంగా స్పందించే వాయలార్ రవి తెలంగాణ పేరు చెబితేనే విసుక్కోవటం ప్రారంభించారు. కాంగ్రెస్లో టిఆర్ఎస్ విలీనం, తెలంగాణపై ప్రకటన, తెలంగాణ కవాతు గురించి ఏమడిగినా అన్నింటికీ ఆయన కోపంతో సమాధానం ఇచ్చారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఇటీవల మీడియా ప్రతినిధులు వేసిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తెలంగాణ సమస్య అత్యంత జటిలమైంది, దీనికి ఇప్పుడిప్పుడే పరిష్కారం లభించే సూచనలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మధ్య అంగీకారం కుదిరితేనే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ బుధవారం జమ్మూ,కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో మాట్లాడుతూ తెలంగాణ అత్యంత జటిలమైన సమస్య అని మరోసారి తేల్చి చెప్పారు. మూడు ప్రాంతాల ప్రజల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదన్నారు. ఏకాభిప్రాయం కుదిర్చేందుకు తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆజాద్ ప్రకటించారు. వెరసి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన సాధ్యం కాదని స్పష్టం చేశారు.
గత పదిహేను, ఇరవై రోజుల నుండి తెలంగాణపై ఏ మాత్రం స్పందించదని కాంగ్రెస్ నాయకులు గత రెండు రోజుల నుండి అవకాశం లభించగానే తెలంగాణకు ప్రతికూలంగా ప్రకటనలు చేయటం గమనార్హం. ఎందుకిలా జరుగుతోందనే ప్రశ్నకు సమాధానం లభించటం లేదు. కాంగ్రెస్లో టిఆర్ఎస్ను విలీనం చేసేందుకు చంద్రశేఖరరావు ఇవ్వగలిగినదానికంటే ఎక్కువ అడిగారా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగానే తనను ముఖ్యమంత్రిగా నియమించాలని చంద్రశేఖరరావు డిమాండ్ చేశారా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తే లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని సీమాంధ్ర ఎంపీలు హెచ్చరించారా? అనేది స్పష్టం కావటం లేదంటూ ఓ ప్రముఖ వార్తా పత్రిక వ్యాఖ్యానించింది. తెలంగాణ జెఏసి, ఇతర తెలంగాణ సంస్థలు ఈనెల 30న చేపట్టిన తెలంగాణ కవాతు నుండి చంద్రశేఖరరావును దూరంగా పెట్టేందుకే కాంగ్రెస్ నాయకులు ప్రకటన పేరుతో రాజకీయం చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.