పనిలో పనిగా..: షర్మిల యాత్రకు 'తెలంగాణ' బ్రేక్
డిసెంబర్ 9వ తేదిన తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నుండి ప్రకటన వచ్చిన రోజు కాబట్టి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ పాదయాత్రకు ఒకరోజు బ్రేక్ ఇచ్చినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతోంది. 2009 డిసెంబర్ 9వ తేదిన రాత్రి పదకొండున్నర గంటలకు తెలంగాణపై అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారని, అందుకే ఈ రోజు యాత్రను సంఘీభావంగా ఒకరోజు ఆపేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణపై ప్రకటన పేరుతో షర్మిల పాదయాత్ర ఒకరోజు వాయిదా పడటం వెనుక తెలంగాణవాదుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయేమోననే భయమే కారణమనే వాదనలు విపిస్తున్నాయి. ఇటీవల పాలమూరు వర్సిటీ వద్ద షర్మిల పాదయాత్రను విద్యార్థులు అడ్డుకోవడం, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణపై ప్రకటన చేసిన రోజు కాబట్టి ఈ రోజు తెలంగాణవాదులు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తారు.
ఇలాంటి సమయంలో పాదయాత్ర చేస్తే అనుకూలించక పోవచ్చునని, ఎక్కడైనా తెలంగాణవాదులు అడ్డుకునే అవకాశాలు లేకపోలేదనే భావనతోనే షర్మిల పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఉంటారని అంటున్నారు. తెలంగాణపై ప్రకటన వచ్చిన రోజు కాబట్టి యాత్రకు బ్రేక్ ఇచ్చామని చెబితే తమకు అనుకూలంగా ఉంటుందనే భావనతోనే వారు అలా చెప్పి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో ఈ కారణంతో షర్మిలకు ఓ రోజు రెస్టు కూడా దొరుకుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారట.