'సత్యం' రాజు అంబులెన్స్ మోడల్ హిట్
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంలో 108 సర్వీసులకు ఆయన డిజైన్ చేశారు. గత ఏడేళ్లుగా 11 రాష్ట్రాలు ఈ నమూనాను స్వీకరించి ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంలో సేవలను అమలు చేస్తున్నాయి. 2005లో రామలింగ రాజు ఎమర్జెన్సీ మెడికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అనే ఎన్జీవోను స్థాపించారు. రామలింగ రాజు జైలుకు వెళ్లిన తర్వాత జివికె గ్రూప్ 2009లో దాన్ని తీసుకుంది.
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతోంది. జివికె ఇఎంఆర్ఐ ద్వారా వచ్చే ఏడాది నాటికి 1,800 అంబులెన్స్లను ప్రవేశపెట్టాలని ఉత్తరప్రదేశ్ ఆలోచన చేస్తోంది. 108 టోల్ ఫ్రీ డయలింగ్ ద్వారా 24 గంటల సేవలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్న మూడు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒక్కటి.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం 108 సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి ప్రజల ఆదరణ లభించడంలో 108 సర్వీసులు ప్రధాన పాత్ర పోషించాయి. ప్రజలకు రోడ్డు ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితిలో ఈ సర్వీసులు అందుబాటులోకి రావడం ఎంతో ఉపయోగకరంగా ఉందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది.