బాబుకు రక్షణగా మాజీ మహిళా నక్సలైట్
టిడిపి అధికారంలో ఉండగా 2003లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారులో ప్రయాణిస్తుండగా నక్సలైట్లు అలిపిరి వద్ద ఆయన కాలును పేల్చిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. బాబును నక్సలైట్లు అప్పుడు టార్గెట్గా పెట్టుకున్నారు. నక్సలైటుగా పని చేసిన ఓ మహిళ ఇప్పుడు బాబుకు రక్షణగా ఉండటం గమనార్హం.
వాలా రమాదేవి అనే మహిళ నక్సలిజంలో పని చేసి వచ్చారు. నక్సలిజంలో ఉన్నప్పుడు ఆమె పేరును స్వర్ణక్కగా పిలిచేవారు. చెన్నూరు ప్రాంతంలో 1990లలో నక్సలిజం వృద్ధికి ఆమె చాలా కృషి చేశారు. పదకొండేళ్ల వయస్సులోనే ఆమె నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. కోటపల్లి మండలం ఎడగట్టు గ్రామానికి చెందిన రమాదేవి జంగిలి గంగన్న(అలియాస్ రామన్న)తో పాటు నక్సలిజంలో పని చేసి చేసింది. గంగన్న చెన్నూరు దళం కమాండర్.
ఆ తర్వాత గంగన్నను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వారు 1993లో సరెండర్ అయి కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత పునరావాసం కింద ప్రభుత్వం రమాదేవిని హోంగార్డుగా నియమించింది. తనకు ఇద్దరు పిల్లలున్నారని, వారిని వృద్ధిలోకి తీసుకు రావడమే తన ముందున్న ప్రస్తుతం ఉన్న లక్ష్యమని రమాదేవి చెబుతున్నారు. ఈమె నిర్మల్ వన్ టౌన్ పోలీసు స్టేషన్ హోంగార్డుగా పని చేస్తోంది. బాబు పాదయాత్రలో ఆయనకు రక్షణగా ఓ హోంగార్డు ఉన్నట్లుగా తమకు తెలియదని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.