ద్రావిడ్, లక్ష్మణ్ లేని లోటు పూడుతుందా?
ఛతేశ్వర్ పుజారా ఈ ఏడాది జరిగిన ఐదు టెస్టు మ్యాచుల్లో ఆడిన తీరుతో సెలెక్టర్ల మనసులు దోచుకున్నాడు. ఐదు మ్యాచుల్లో అతను 620 పరుగులు చేశాడు. సగటు 103.33 ఉంది. ఇందులో మూడు సెంచరీలున్నాయి. ఈడెన్ గార్డెన్స్లో పుజారా విఫలమైనప్పటికీ గత రికార్డు బాగానే ఉంది. అతను ఇంగ్లాండుతో జరిగిన మూడు మ్యాచుల్లో 404 పరుగులు చేశాడు. సగటు 134.66 ఉంది. ఈ లెక్కన చాలా మంది కన్నా అతను మెరుగ్గానే ఉన్నాడు.
విరాట్ కోహ్లీ మాత్రం నిరాశపరుస్తున్నాడు. అతని సగటు కేవలం 16.25 ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచుతో పాటు మూడు టెస్టుల్లో అతను 65 పరుగులు మాత్రమే చేశాడు. అతని అత్యధిక స్కోరు గత ఐదు మ్యాచుల్లో 19 మాత్రమే. ఇంగ్లాండు బౌలర్లను ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీ విఫలమవుతున్నాడు.
కోహ్లీ సగటు ఈ క్యాలెండర్ ఇయర్లో 47,.16 ఉంది. ఎనిమిది మ్యాచుల్లో (14 ఇన్నింగ్సుల్లో) అతను 566 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. నిలకడగా ఆడుతున్నాడని భావిస్తున్న సమయంలో ఇంగ్లాండుపై సిరీస్లో కోహ్లీ మాట కూడా వినిపించడం లేదు.
టాప్ ఆర్డర్ కూడా ఘోరంగా విఫలమవుతోంది. వీరేంద్ర సెహ్వాగ్ (462 పరుగులు, 8 టెస్టులు), గౌతం గంభీర్ (403 పరుగులు, 8 టెస్టులు), సచిన్ టెండూల్కర్ (350 పరుగులు, 8 టెస్టులు), ఎంఎస్ దోనీ (348 పరుగులు, 7 టెస్టులు). టాప్ ఆర్డర్ తీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో రెండో టెస్టు మ్యాచులో భారత్ ఇంగ్లాండుపై పది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత బ్యాట్స్మెన్ తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. ఈ స్థితిలోనే ద్రావిడ్, లక్ష్మణ్ వంటి దిగ్గజాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా వంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ భారత స్కోరు 300 పరుగులు దాటించడం కూడా కష్టమవుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.