ఎర్రన్నాయుడు తనయుడు వొస్తున్నాడు?
శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి ఎర్రన్నాయుడు నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు తరఫున పోటీ చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ రామమనోహర్ నాయుడిని అడిగే అవకాశాలున్నాయి.
ఇరవై ఏడేళ్ల రామమనోహన్ నాయుడు లండన్లో చదువుకుంటున్నాడు. రామమనోహర్ నాయుడు అంగీకరించని పక్షంలో మాజీ శాసనసభ్యుడు అచ్చెంనాయుడిని రంగంలోకి దించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఎర్రన్నాయుడి స్థానంలో ఎవరిని రంగంలోకి దించాలనే విషయంతో పాటు పలు అంశాలపై తెలుగుదేశం పార్టీ పోలిట్బ్యూరో సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పెరుగుతున్న వలసలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో జరిగే పోలిట్బ్యూరో సమావేశంలో శానససభ్యుల వలసలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను అడిగే అవకాశం ఉంది. శాసనసభ్యుల వలసల కారణంగా అసెంబ్లీలో తెలుగుదేశం బలం 92 నుంచి 81 తగ్గింది. ఇది వచ్చే ఎన్నికలపై ఏ విధమైన ప్రభావం చూపుతుందనే విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది.