భాను దందా: టీవీ యాంకర్, జగన్ పార్టీ నేత
రిజిస్ట్రేషన్ సమయంలో భాను కిరణ్ ఓ మహిళను తీసుకొచ్చి ఆమెనే సునీతగా కార్యాలయ సిబ్బందికి పరిచయం చేసి, ఆమెతోనే సంతకాలు తీసుకున్నాడని సిఐడి విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు. ఆ మహిళ ఓ టీవీ చానెల్కు చెందిన మాజీ యాంకర్ అని సిబిఐ విచారణలో భాను కిరణ్ బయటపెట్టినట్లు చెబుతున్నారు. సూరి హత్య సమయంలో ఆ టీవీ యాంకర్ వ్యవహారం బయటకు వచ్చింది. తప్పుడు ధ్రువపత్రాలు బయటపడడంతో ఆ టీవీ యాంకర్పై సిఐడి కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
భాను కిరణ్ చేత భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభాకర్ రెడ్డి మీద సిఐడి అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు రేవంత్ రెడ్డికి కూడా ఈ వ్యవహారం చుట్టుకుంటోంది. రేవంత్ రెడ్డిని సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సునీత శ్రీనివాస రెడ్డి ద్వారా పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు, ఈ సమయంలో ప్రభాకర్ రెడ్డి, మంగలి కృష్ణ రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు చెబుతున్నారు. ఇందుకు భాను కిరణ్ ముఠా రేవంత్ రెడ్డికి 50 లక్షల రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారం రాబట్టేందుకు సిఐడి అధికారులు రేవంత్ రెడ్డిని ప్రశ్నించవచ్చునని అంటున్నారు. అయితే, ఈ విషయంలో తనకు ఏ విధమైన ప్రమేయం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు.
కోర్టు అనుమతితో సిఐడి అధికారులు భాను కిరణ్, మంగలి కృష్ణను తమ కస్టడీలోకి తీసుకుని ఆదివారం విచారించారు. ఆ విచారణలో పై విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై భాను కిరణ్ను, మంగలి కృష్ణము ఆదివారం ఒకేచోట కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు చెబుతున్నారు.