ఎర్రన్నాయుడి మృతిపై డిఎల్: చిక్కుల్లో 'కిరణ్'?
ఇది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. 108 వాహనం ఆలస్యంగా వచ్చిందని, అది వెంటనే వచ్చి ఉంటే, అందులో ఆక్సిజన్ ఉండి ఉంటే ఎర్రన్నాయుడి వంటి ముఖ్యమైన నేతను మనం బతికించుకుని ఉండేవారమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల శనివారం తన మరో ప్రజా ప్రస్థానం యాత్రలో అనంతపురం జిల్లాలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 108 సర్వీసులు ప్రాణాలు నిలబెట్టాయన్నారు.
తెలుగుదేశం పార్టీ కూడా 108 వాహనంలో ఆక్సిజన్ లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 108 వాహనంలో ఆక్సిజన్ లేకపోవడం వల్లనే ఆయన మృతి చెందాడని ఖచ్చితంగా చెప్పలేకున్నా, బ్రతికించుకుని ఉండగలిగే వారమనే వాదన వినిపిస్తోంది. అయితే విపక్షాల విమర్శలు ఎలా ఉన్నప్పటికీ.. సాక్ష్యాత్తూ కిరణ్ కేబినెట్లోని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఎర్రన్నాయుడి మృతిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.
ఎర్రన్నాయుడి కోసం వచ్చిన 108 వాహనంలో ఆక్సిజన్ లేదని ఆయన చెబుతున్నారు. ఉంటే వేరేలా ఉండేదేమో అన్నట్లుగా మాట్లాడారు. ఇది చర్చకు దారి తీసింది. సొంత పార్టీ నేత, అదీ సంబంధిత కేబినెట్ మంత్రి ఈ వ్యాఖ్య చేయడంతో కిరణ్ ప్రభుత్వం ఖచ్చితంగా చిక్కుల్లో పడ్డట్లే అని అంటున్నారు. దీనిపై ఖచ్చితమైన వివరణ ప్రభుత్వం నుండి రావాల్సిందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెసు నేతల వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. డిఎల్ వ్యాఖ్యలను మంత్రి కొండ్రు మురళి తీవ్రంగా ఖండించారు. 108లో ఆక్సిజన్ లేదని డిఎల్ చెప్పడం సరికాదన్నారు. బాద్యతారహితంగా డిఎల్ మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 108కి ఫోన్ చేయగానే కేవలం తొమ్మిది నిమిషాల్లోనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి తాము వచ్చినట్లు ఆ యాజమాన్యం చెబుతోందని, అప్పటికే మరో దాంట్లో ఎర్రన్నాయుడిని తీసుకు వెళ్లినట్లు చెబుతున్నారని, 108లో తీసుకు వెళ్లిన వారికి చికిత్స అందించామని చెబుతున్నారు.