కూల్చకుండా: 2014 కోసం జగన్ బైపోల్స్ వ్యూహం
మరోసారి ఉప ఎన్నికలు తీసుకు వస్తే సెంటిమెంట్ కారణంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందటం ఖాయమని, ఈ ప్రభావం 2014 ఎన్నికల వరకు ఉంటుందని జగన్ భావిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. తాను జైలులో ఉన్నందు వల్ల పార్టీలో కాస్త స్తబ్దత నెలకొందని, తన సోదరి షర్మిల పాదయాత్రతో స్తబ్దత తగ్గి కొత్త ఉత్సాహం వచ్చినా.. పార్టీకి మరింత ఊపు తెచ్చే ఉద్దేశ్యంలో భాగంగా ఉప ఎన్నికలు అయితేనే బాగుంటాయని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం.
మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉప ఎన్నికలు తీసుకు వస్తే 2014 సాధారణ ఎన్నికల వరకు ఆ ప్రభావం ఉంటుందని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇటీవల పలువురు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు జగన్ పార్టీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే. అదే జరిగితే మరో ఆరు నెలల్లో పది నుండి పన్నెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే రాజీనామాలను స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించినప్పటికీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీసుకునే నిర్ణయంపై ఉప ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకు సీమాంధ్రలో కాంగ్రెసు నుండి నలుగురు, టిడిపి నుండి నలుగురు ఎమ్మెల్యేలు జగన్కు జై కొట్టారు. తెలంగాణ ప్రాంతంలోను ఇద్దరు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉప ఎన్నికల వరకు పార్టీని బలపర్చాలనే ఉద్దేశ్యంతోనే జగన్ తన సోదరిచే పాదయాత్ర తలపెట్టారని అంటున్నారు.
కాంగ్రెసు ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్(చింతలపూడి), ఆళ్లనాని(ఏలూరు), ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి(కాకినాడ), సుజయ కృష్ణ రంగారావు(బొబ్బిలి), టిడిపి ఎమ్మెల్యేలు కొడాలి నాని(గుడివాడ), ప్రవీణ్ కుమార్ రెడ్డి(తంబళ్లపల్లి), వనిత(గోపాలపురం), అమర్నాథ్ రెడ్డి(పలమనేరు)లు జగన్ వైపు వెళ్లనున్నారు. జగన్ ఓకె చెబితే వీరు ఎప్పుడైనా రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే హరీశ్వర్ రెడ్డి(పరిగి) తెరాసలో చేరనున్నారు. వేణుగోపాల చారి(ముథోల్) కూడా అదే బాటలో ఉన్నారు.