వైయస్ భూపందేరాలు: ఖజానాకు లక్ష కోట్ల గండి
మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా చిల్లర పైసలకే విలువైన భూములు కట్టబెట్టారని తెలిపింది. "జిల్లా కలెక్టర్లు/సాధికార సంఘం సిఫారసు చేసిన మార్కెట్ విలువకూ, ప్రభుత్వ భూములను బదలాయించిన రేట్లకూ భారీ వ్యత్యాసం ఉంది. దీనివల్ల వివిధ సంస్థలు, వ్యక్తులకు ఏకంగా రూ.1784 కోట్ల అయాచిత లబ్ధి చేకూరింది'' అని కాగ్ వివరించింది. "2006-11 సంవత్సరాల మధ్య 1027 మందికి 88,492 ఎకరాలు కట్టబెట్టారు. మచ్చుకు 11 జిల్లాలో 459 మందికి జరిగిన కేటాయింపులను పరిశీలించాం. వాణిజ్య అవసరాలకు భూకేటాయింపులు జరిగిన తీరులో ఒక పద్ధతి లేదు. పారదర్శకత లేదు. ప్రజా ప్రయోజనాలను కాపాడేలా లేదు'' అని కాగ్ చెప్పింది.
భూములను ఏపీఐఐసీ బదలాయించిన తీరును కాగ్ తప్పు పట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారవృద్ధికి యథాశక్తి సహకరించిందని విమర్శించింది. రాష్ట్రంలో పారిశ్రామికీరణకు ఏపీఐఐసీ ఏమాత్రం తోడ్పడలేదని, ప్రభుత్వ ప్రయోజనాలనూ కాపాడలేదని ఏపీఐఐసీని కాగ్ తప్పు పట్టింది. ఏపీఐఐసీ వ్యవహారం వల్ల రియల్టర్ల వ్యాపారం బాగు పడిందని, సమాచార-సాంకేతిక మౌలిక వసతులను అభివృద్ధి చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం మాత్రం నెరవేరలేదని స్పష్టం చేసింది. కేటాయించిన భూములు అమ్ముకుంటున్నా, తాకట్టు పెట్టుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేకపోయిందని తెలిపింది.
వేల ఉద్యోగాలు వస్తాయని నమ్మబలుకుతూ వందల ఎకరాలను 'సెజ్'లకు కట్టబెట్టిన ప్రభుత్వ ప్రకటనల్లోని డొల్లతనాన్ని కాగ్ అంకెలతో సహా బయటపెట్టింది. మచ్చుకు 11 సెజ్లను మాత్రం పరిశీలించింది. 5,92,507 ఉద్యోగాలు వస్తాయంటూ ప్రభుత్వం 17,911 ఎకరాలను పంచి పెట్టిందని, కానీ వీటిద్వారా కేవలం 25,582 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని కాగ్ పట్టిక రూపంలో బయటపెట్టింది. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులు పూర్తికానివైనంపై కాగ్ మండిపడింది. కేటాయింపులు జరిగినా వృథాగా ఉన్న భూముల లెక్క తీసింది. కాగ్ నివేదిక సిబిఐ దర్యాప్తునకు పనికి వచ్చే విధంగా ఉంది.