గాలి బళ్లారి రాజు: అలిఖాన్ సామంతరాజు
సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం - బళ్లారి ప్రాంతంలో ఎవరు లీజులు పొందాలన్నా గాలి జనార్దన్ రెడ్డి అనుమతి పొందాల్సిందేనట. ఇతర లీజు కంపెనీలతో బలవంతపు ఒప్పందాలు, ఆక్రమణలు గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో యధేచ్ఛగా సాగాయి. అక్రమ మైనింగ్ కార్యకలాపాల్లో అలీఖాన్ సహాధ్యాయులు మధుకుమార్ వర్మ, సి. శ్రీకాంత్, వి. చంద్రశేఖర రావు భాగస్వాములుగా ఉన్నారు.
అలీఖాన్కు యాక్సిస్ బ్యాంకులో మూడు ఖాతాలు, శ్రీకాంత్, చంద్రశేఖర్, మధు కుమార్ వర్మలతో పాటు అలీఖాన్ తండ్రి కె. ఇక్బాల్కు కూడా ఖాతాలున్నాయి. థర్డ్ ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఐదు కోట్ల రూపాయలు అలీఖాన్ ఖాతాలోకి బదిలీ అయ్యాయని, ఆ మొత్తాన్ని తనకే చెందిన మరో ఖాతాలోకి, అక్కడి నుంచి పిఓలు, డిడీల ద్వారా మళ్లించి జిపిఎగా బెంగుళూర్ విమానాశ్రంయ వద్ద భూమి కొనుగోలుకు ఖర్చు పెట్టారని సిబిఐ తన అభియోగ పత్రంలో వివరించింది.
దేవి ఎంటర్ప్రైజెస్ కార్యాలయం ఆవరణలోని మధుశ్రీ ఎంటర్ప్రైజెస్ కూడా అలీఖాన్ సన్నిహితులదేనని, వారికి ఐదు కోట్ల రూపాయల చొప్పున రాగా వాటిని ఇతర ఖాతాల ద్వారా భూమి కొనుగోలుకు వినియోగించారని చెప్పింది.
కంప్లి శాసనసభ్యుడు టిహెచ్ సురేష్ బాబు ద్వారా అలీఖాన్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి ఇండస్ట్రీస్లో 2007లో చేరారని, 2009లో రాజీనామా చేసి చంద్రశేఖర్తో కలిసి దేవి ఎంటర్ప్రైజెస్ను ఏర్పాటు చేశారని సిబిఐ తెలిపింది. అలీఖాన్ జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినని చెప్పుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని సిబిఐ తెలిపింది.